షిర్డీ సాయిబాబా ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత.. నిరసనగా మే 1 నుంచి నిరవధిక బంద్

  • సాయి సంస్థాన్ ట్రస్ట్ ‌నిర్ణయంపై గ్రామస్థుల ఆగ్రహం
  • ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలని డిమాండ్
  • ఆలయంలో 50 శాతం ధర్మకర్తలు షిర్డీ నుంచే ఉండాలంటున్న గ్రామస్థులు 
  • గ్రామస్థుల బంద్ ప్రభావం ఆలయ దర్శనాలపై ఉండదంటున్న అధికారులు
షిర్డీ సాయిబాబా ఆలయానికి మరింత భద్రత కల్పించాలన్న సాయి సంస్థాన్ ట్రస్ట్, మహారాష్ట్ర పోలీసుల నిర్ణయాన్ని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని నిరసిస్తూ  మే 1 నుంచి నిరవధిక బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆలయ భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్ సిబ్బంది పర్యవేక్షిస్తుండగా, ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూస్తున్నారు. 

సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో ఆలయ భద్రతపై బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరగా, సీఐఎస్ఎఫ్ భద్రతకు ట్రస్ట్ ఓకే చెప్పింది. అయితే, ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రతను కల్పించాలన్న నిర్ణయాన్ని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

అలాగే, సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలని, ప్రభుత్వ డిప్యూటీ కలెక్టరు, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ ఉండాలని షిర్డీలోని అఖిలపక్ష నాయకులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీల బోర్డును వీలైనంత త్వరగా నియమించాలని, అందులో 50 శాతం ధర్మకర్తలు షిర్డీ నుంచే ఉండాలని కోరుతున్నారు. కాగా, గ్రామస్థుల సమ్మె ప్రభావం ఆలయంపై ఉండదని, దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.


More Telugu News

Shirdi Temple Maharashtra CISF Sai Baba Temple