sudan: సూడాన్ నుండి ప్రతి భారతీయుడుని సురక్షితంగా తరలిస్తాం: కేంద్రం

  • 5 వేలమందికి పైగా భారతీయులు ఉన్నారన్న విదేశాంగ శాఖ
  • తరలింపు కోసం మూడో నౌకను కూడా సూడాన్ పంపిన భారత్
  • తరలింపులో సౌదీ సహకారానికి భారత్ థ్యాంక్స్
  • ఇతర దేశాల పౌరుల నుండి కూడా తరలింపు కోసం విజ్ఞప్తులు
India deploys third naval ship for Sudan evacuation operation

సూడాన్ నుండి ప్రతి భారతీయుడిని సురక్షితంగా తరలిస్తామని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా చెప్పారు. సూడాన్ లో సైన్యం, పారామిలిటరీ మధ్య అంతర్యుద్ధం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంలో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన వారు చిక్కుకుపోయారు. భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరీని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా విదేశాంగ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, సూడాన్ అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అక్కడి పరిస్థితులను నిరంతరం కంట్రోల్ రూమ్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అక్కడ 3500 మంది భారతీయులు, వెయ్యి మంది భారత సంతతి వ్యక్తులు చిక్కుకొని ఉండవచ్చునని చెప్పారు.

ఇప్పటి వరకు 1700కు పైగా భారతీయులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు. తరలింపులో భాగంగా మూడో నౌక సూడాన్ పోర్టుకు చేరుకుందని చెప్పారు. సూడాన్ నుండి సౌదీ చేరుకున్న 360 మంది భారతీయులు జెడ్డా నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నట్లు తెలిపారు. తరలింపు ప్రక్రియలో సౌదీ సహకరిస్తోందని చెబుతూ, థ్యాంక్స్ చెప్పారు. ఇతర దేశాల పౌరుల నుండి కూడా తరలించాలనే విజ్ఞప్తులు వస్తున్నాయని, వాటిని కూడా స్వీకరిస్తున్నట్లు చెప్పారు.

More Telugu News