Deserved: ఓటమికి అర్హులమేనంటూ విరాట్ కోహ్లీ నిట్టూర్పు

  • తామే ఆటను తీసుకెళ్లి వారి చేతుల్లో పెట్టామన్న కోహ్లీ
  • ప్రొఫెషనల్ గా ఆడలేదని అంగీకారం
  • ఫీల్డింగ్ లో ప్రమాణాలు లోపించాయన్న ఆర్సీబీ కెప్టెన్
Deserved to lose not professional enough Furious Virat Kohli goes ballistic at RCB teammates after loss to KKR

గెలిచేటంత సత్తా ఉంది. అయినా కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) చేతిలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) ఓడిపోయింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నా, పోరాడలేకపోయారు. తమ జట్టు ఆట ప్రదర్శన పట్ల విరాట్ కోహ్లీ సైతం ఎంతో అసంతృప్తితో ఉన్నట్టు మ్యాచ్ తర్వాత అతడి మాటలు వింటే అర్థమవుతోంది. 

‘‘నిజాయతీగా చెప్పాలంటే మేమే ఆటను తీసుకెళ్లి వారి చేతిలో పెట్టేశాం. ఓటమికి మేము అర్హులమే. మేమేమీ ప్రొఫషనల్ గా ఆడలేదు. బౌలింగ్ బాగా చేశాం. కానీ, ఫీల్డింగ్ మాత్రం ప్రమాణాలకు తగ్గట్టు లేదు. ఈ విజయం వారికి ఉచితంగా అందజేసింది. ఫీల్డింగ్ లో మేము రెండు క్యాచ్ లను వదిలేశాం. దానివల్ల 25-30 అదనపు పరుగులను మూల్యంగా చెల్లించుకున్నాం. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మేము బాగానే ఆరంభించాం. కానీ, నాలుగు నుంచి ఐదు వికెట్లను సునాయాసంగా పోగొట్టుకున్నాం’’ అని విరాట్ కోహ్లీ ఓటమికి తన విశ్లేషణ తెలియజేశాడు. 

‘‘వికెట్లను పడగొట్టేంతగా బౌలింగ్ ఏమీ లేదు. కాకపోతే మేమే వాటిని నేరుగా ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లేలా బాదాం. చేజింగ్ లో కనీసం ఒక భాగస్వామ్యాన్ని అయినా నమోదు చేసి ఉండాల్సింది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. ఇదేమీ మమ్మల్ని ఒత్తిడికి గురి చేసేది కాదు. టోర్నమెంట్ తదుపరి దశలో మరింత మెరుగ్గా ఆడాలి’’ అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 4 విజయాలతో పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.

More Telugu News