Odisha: ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకున్న వరుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు!

  • ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లాలో ఘటన
  • మరికాసేపట్లో పెళ్లనగా పోలీసుల రంగప్రవేశం
  • రెండేళ్లుగా ప్రేమించిన యువతికి ముఖం చాటేసిన ప్రియుడు
  • ఆపై మరో పెళ్లికి సిద్ధం కావడంతో ప్రియురాలి ఫిర్యాదు
  • మండపంలోనే అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు
Odisha Police arrest groom while getting ready to marry

వరుడు ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకున్నాడు. బంధువులతో అక్కడంతా కోలాహలంగా ఉంది. మరికాసేపట్లో వధువు మెడలో వరుడు తాళికట్టేవాడే. అంతలోనే పోలీసులు రంగప్రవేశం చేశారు. అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అక్కడేం జరుగుతోందో తెలియక మండపంలో కలకలం రేగింది. పెళ్లి ఆగిపోయింది. ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లాలో జరిగిందీ ఘటన.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢెంకానాల్‌కు చెందిన అజిత్ కుమార్ భోయ్ ఒడిశా ఆర్టీసీలో జేఈఈగా పనిచేస్తున్నాడు. బెహెరాపాలి గ్రామానికి చెందిన యువతితో ఇటీవల అతడికి వివాహం నిశ్చయమైంది. మంగళవారం రాత్రి పెళ్లి జరగాల్సి ఉండగా కొన్ని నిమిషాల ముందు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

భువనేశ్వర్‌కు చెందిన యువతితో రెండేళ్లపాటు ప్రేమాయణం నడిపిన అజిత్ పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆపై ముఖం చాటేశాడు. ఇప్పుడు మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన యువతి భువనేశ్వర్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు.

More Telugu News