Bandi Sanjay: ఒవైసీ కళ్లలో ఆనందం చూడడానికే...!: బండి సంజయ్

  • బీజేపీ అధికారంలోకి వస్తే సచివాలయం రూపురేఖలు మారుస్తామని వ్యాఖ్య
  • పేపర్ లీకేజీలో ఇద్దరే ఉన్నారని కేటీఆర్ చెప్పారన్న సంజయ్
  • తెలంగాణ ఎవరి కోసం సాధించుకున్నామని బండి ఆవేదన
  • అతీక్ అహ్మద్ కంటే కేసీఆర్ పెద్ద గ్యాంగ్ స్టర్ అని ఫైర్
Bandi Sanjay shocking comments on kcr and KTR

ఓవైసీ కళ్లలో ఆనందం చూడటానికే సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయాన్ని కడుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయం రూపు రేఖలు మారుస్తామన్నారు. ఇక్కడి నల్ల పోచమ్మ గుడిని కూల్చేసి కేవలం రెండున్నర కుంటలు ఇచ్చారని, కానీ తాము అధికారంలోకి వచ్చాక ఇక్కడి నల్ల పోచమ్మ గుడిని స్వర్ణ దేవాలయంలా మారుస్తామన్నారు.

యూపీలోని అతీక్ అహ్మద్ కంటే కేసీఆర్ పెద్ద గ్యాంగ్ స్టర్ అని వ్యాఖ్యానించారు. నయీమ్ ను చంపిన గ్యాంగ్ స్టర్ కేసీఆరే అని ఆరోపించారు. ఓ వైపు అకాల వర్షాలతో రైతులు నష్టపోతుంటే మంత్రులు మాత్రం డ్యాన్స్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 

పేపర్ లీకేజీ నిర్వాకం పెద్దలదే అన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ విచారణను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లీకేజీకి ఇద్దరు కారణమని కేటీఆర్ చెప్పారని, కానీ 50 మందిని ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నారు.

తాను నిరుద్యోగుల కోసం పోరాడితే జైలుకు పంపించారన్నారు. నష్టపోయిన నిరుద్యోగులకు రూ.1 లక్ష చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని వ్యక్తి సీఎంగా ఎందుకు? అని ప్రశ్నించారు. తెలంగాణను ఎవరి కోసం సంపాదించుకున్నాం... కేసీఆర్ కుటుంబం కోసమా...! అని ఆవేదన వ్యక్తం చేశారు. మియాపూర్ భూముల సిట్ నివేదిక ఏమైందన్నారు. అన్ని తప్పులకు బండి సంజయ్ కారణమైతే ఇక సీఎంగా కేసీఆర్ ఎందుకన్నారు.

  • Loading...

More Telugu News