JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ ఆఫీసు ఆవరణలో స్నానం చేసి నిరసన తెలిపిన జేసీ ప్రభాకర్ రెడ్డి

  • మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటున్న టీడీపీ కౌన్సిలర్లు
  • తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ తీరునే నిరసిస్తున్న వైనం 
  • టీడీపీ కౌన్సిలర్ల దీక్షకు మద్దతు పలికిన జేసీ ప్రభాకర్ రెడ్డి
  • గతరాత్రి మున్సిపల్ ఆఫీసులోనే నిద్రించిన నేత
JC Prabhakar Reddy takes bath at Tadipatri municipal office

రాజకీయాల్లో జేసీ సోదరుల పంథానే వేరు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన తెలిపేందుకు వినూత్న మార్గం ఎంచుకున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ గళం వినిపిస్తున్న టీడీపీ కౌన్సిలర్లకు ఆయన మద్దతు పలికారు. 

టీడీపీ కౌన్సిలర్లకు మద్దతుగా నిన్నటి రాత్రి నుంచి నిరసన చేపట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి... తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలోనే నిద్రించారు. ఉదయాన్నే లేచి, మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనే బ్రష్ చేశారు. కార్యాలయం ఎదుటే, ఓ కుర్రాడు పైపుతో నీళ్లు పడతుండగా, జేసీ శుభ్రంగా స్నానం చేశారు. అనంతరం నిరసన శిబిరంలో కూర్చున్నారు. 

మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై కమిషనర్, ఇతర అధికారులు పట్టించుకోవడంలేదని కొంతకాలంగా టీడీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో జేసీ కూడా పాల్గొన్నారు. కాగా, ఈ నిరసనకు పెద్దపప్పూరు, యాడికి మండలాల టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి.

More Telugu News