మరో వివాదంలో ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్

Google CEO Sundar Pichai Receives 200 Million dollars In 2022 Amid Cost Cutting
  • 2022లో ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ పారితోషికం 226 మిలియన్ డాలర్లు
  • స్టాక్‌మార్కెట్ నియంత్రణ సంస్థకు తెలిపిన ఆల్ఫాబెట్
  • గూగుల్ ఉద్యోగి సగటు వేతనం కంటే సుందర్ పారితోషికం 800 రెట్లు అధికం
  • సంస్థలో లేఆఫ్స్ నేపథ్యంలో చర్చనీయాంశంగా మారిన సుందర్ పారితోషికం
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ చుట్టూ మరో వివాదం ముసురుకుంటోంది. ఓవైపు కంపెనీలో ఉద్యోగుల తొలగింపు, పొదుపు చర్యలు చేపడుతున్న తరుణంలోనే ఆయన ఏకంగా 226 మిలియన్ డాలర్ల పారితోషికం తీసుకున్నారన్న వార్త సంచలనంగా మారింది. సుందర్ పిచాయ్ పారితోషికానికి సంబంధించిన వివరాలను ఆల్ఫాబెట్.. స్టాక్‌మార్కెట్‌ నియంత్రణ సంస్థకు వెల్లడించింది. సుందర్ అందుకున్న పారితోషికంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డ్స్ కూడా ఉన్నట్టు తెలిపింది. 

గతేడాది సుందర్ పారితోషికం గూగుల్ సగటు ఉద్యోగి వేతనం కంటే 800 రెట్లు అధికం కావడం సంచలనం కలిగిస్తోంది. సంస్థలో పొదుపు చర్యల పేరిట ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో సుందర్ ఈ స్థాయి పారితోషికం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 

మరోవైపు, ఈ నెల మొదట్లో లండన్‌లోని గూగుల్ ఉద్యోగులు లేఆఫ్స్‌కు నిరసనగా వాకవుట్ చేశారు. అంతకుమునుపు, జ్యూరిచ్‌లో 200 మంది ఉద్యోగులను తొలగించడంపై ఇతర ఉద్యోగులు నిరసన చేపట్టారు. మొత్తం 12 వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు గూగుల్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా గడ్డు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తొలగింపులు తప్పవని గూగుల్ అప్పట్లో ప్రకటించింది.
Go Back to Shorts
Sundar Pichai

More Telugu News