Bollywood: ఐశ్వర్యా రాయ్ తనయ ఆరాధ్యకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

  • అభిషేక్‌, ఐశ్వర్య తనయ చనిపోయిందంటూ 
    యూట్యూబ్‌లో ఫేక్‌ వార్తలు
  • ఆమె ఆరోగ్యంపై మార్ఫింగ్‌ వీడియోలు
  • తొలగించాలని ఆదేశించి గూగుల్‌కు చీవాట్లు పెట్టిన హైకోర్టు
Delhi HC restrains YouTube from publishing misleading content on Aaradhya Bachchan healt

బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ల తనయ ఆరాధ్యకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆరాధ్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమె చనిపోయిందంటూ కొన్ని యూట్యూబ్‌ చానళ్లు ఫేక్ న్యూస్ ప్రసారం చేశాయి. అవి వాట్సాప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. దాంతో, ఆయా యూట్యూబ్‌ వీడియోలను, యూఆర్‌ఎల్స్ ను తొలగించేలా ఆదేశాలివ్వాలంటూ ఆరాధ్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తొమ్మిది యూట్యూబ్‌ చానళ్ల నిర్వాహకులను ప్రతివాదులుగా చేర్చింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శంకర్ ఈ పిటిషన్ ను నిన్న విచారించారు. 

ఈ కేసులో ఆరాధ్య తరఫున ప్రముఖ న్యాయవాది దయాన్‌ కృష్ణన్‌ సహా మొత్తం 14 మంది లాయర్లు వాదనలు వినిపించారు. వారి వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి యూట్యూబ్‌ చానళ్లు, యూట్యూబ్‌ మాతృ సంస్థ గూగుల్‌కు చీవాట్లు పెట్టారు. వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. గూగుల్‌ వెంటనే స్పందించి, యూట్యూబ్‌లో ఉన్న వీడియోలను తొలగించాలని, గూగుల్‌ ప్లాట్‌ ఫామ్‌పై షేర్‌ అయిన యూఆర్‌ఎల్స్‌ ను తొలగించాలని జస్టిస్ శంకర్‌ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవ్వకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖను ఆదేశించింది.

More Telugu News