Nara Lokesh: పాదయాత్ర 100వ రోజున యూత్ మేనిఫెస్టో విడుదల: లోకేశ్

  • ఆదోని నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర
  • ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లిన టీడీపీ అగ్రనేత
  • పారతో మట్టి తవ్విన వైనం
  • మంత్రి గుమ్మనూరికి మరోసారి సవాల్
  • సబ్జెక్టుతో రావాలని స్పష్టీకరణ
Lokesh said TDP will release youth manifesto on Padayatra 100th day

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 76వ రోజు (గురువారం) ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. చిన పెండేకల్ వద్ద ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎదురేగి లోకేశ్ కు ఘనస్వాగతం పలికారు. 

పెదపెండేకల్ శివారు ఎర్రచెరువు వంక వద్ద ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లిన లోకేశ్ పారతో మట్టి తవ్వి కూలీల కష్టాలు తెలుసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేస్తే ఇచ్చే రూ.150 రూపాయల కూలీ పెరిగిన ధరల వల్ల ఏమూలకు సరిపోవడంలేదని, కూలీ పెంచేలా ప్రయత్నించాలని కూలీలు కోరారు. 

అనంతరం ఆరేకల్లులో వాల్మీకి సామాజిక వర్గీయులు లోకేశ్ కలిసి తమను ఎస్టీల్లో చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. భోజన విరామ సమయంలో నాగలాపురం వద్ద యువతతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న లోకేశ్... టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు తెచ్చి కర్నూలు జిల్లాలో వలసలను నివారిస్తామని భరోసా ఇచ్చారు. 

77వ రోజున (శుక్రవారం) ఆదోనిలోని అడిగుప్పక్రాస్ వద్ద యువగళం పాదయాత్ర 1000 కి.మీ. మైలురాయిని చేరుకోనుంది.

మంత్రి గుమ్మనూరు జయరాంకు మళ్లీ సవాల్ విసిరిన లోకేశ్

ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై లోకేశ్ మరోసారి ధ్వజమెత్తారు. 180 ఎకరాల ఇటినా భూములను బెంజ్ మంత్రి కాజేశారని ఆరోపించారు. కమర్షియల్ ల్యాండ్ గా ఉన్న భూమిని వ్యవసాయ భూములుగా చూపి తన కుటుంబం పేర రిజిస్ట్రేషన్ చేయించారని వివరించారు. 

"రూ.45 కోట్లు విలువైన భూమిని రూ.2 కోట్లు ప్రభుత్వ వాల్యూ చూపించి కారు చౌకగా కొట్టేసిన ఘనుడు బెంజ్ మంత్రి. వ్యవసాయం లో లాభం వచ్చింది అన్న మంత్రి గారు ప్రభుత్వం నుండి పంట నష్టపరిహారం ఎందుకు తీసుకున్నారు? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నిబంధనలు గుమ్మనూరు, ఆయన కుటుంబం అతిక్రమించి భూములు కొనుగోలు చేశారు. భూములు అమ్మిన మంజునాథ్ సేల్ డీడ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు? అసలు ఆ భూములు అమ్మే హక్కు అతనికి లేదు కాబట్టి సేల్ డీడ్ రద్దు చేసుకున్నాడు. ఐటీ బినామీ యాక్ట్ ప్రకారం బెంజ్ మంత్రి అడ్డంగా దొరికిపోయారు" అని లోకేశ్ వెల్లడించారు. 

"కుటుంబ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతో ఇటినా భూములు కొన్నానంటున్న బెంజ్ మంత్రి...కుటుంబ భూముల గురించి ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు చూపలేదు?ప్రభుత్వ ధర ప్రకారం ఎవరైనా ముందుకు వస్తే భూములు రైతులకు వెనక్కి ఇస్తాం అన్న బెంజ్ మంత్రి గారు ఇప్పుడు ఎందుకు మాట మార్చారు? ప్రభుత్వ ధర ప్రకారం ఆ భూములు కొని రైతులకు పంచుతానని నేను అంటే దానికి స్పందించకుండా అర్దం లేని ఆరోపణలు చేస్తూ అసభ్య పదజాలంతో తిట్టడం ఎంత వరకూ సబబు? నేను నేరుగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే దైర్యం లేకే బూతులు తిడుతున్నారు. 

మంత్రి గారూ... మీకు దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు వందల ఎకరాల అధిపతి అయ్యారు? ఇక్కడ ఉన్న ఒక్క వాల్మీకి కుటుంబం అయినా ఒక ఎకరం భూమి కొనే స్థితిలో ఉన్నారా? మీరు బెంజ్ కారు కొన్నారు. ఇక్కడ ఉన్న వాల్మీకి సోదరులు ఒక్క చిన్న కారు అయినా కొనే స్థితిలో ఉన్నారా? రైతులకి భూములు రాసిస్తా అని అన్నారు. దానికి మేము సిద్దం. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? బూతులతో కాకుండా ఈసారైనా సబ్జెక్ట్ తో మీడియా ముందుకు రండి" అంటూ లోకేశ్ సవాల్ విసిరారు.

మరోసారి జగన్ సీఎం అయితే రాష్ట్రం బీహారే!

జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఏపీని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆదోని నియోజకవర్గం నాగలాపురంలో యువతతో ముఖాముఖి సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన ఏ హామీని జగన్ అమలు చేయలేదని ఆరోపించారు. 

"యువత ప్రశ్నిస్తారనే భయంతో పరదాల చాటున, పోలీసులను అడ్డుపెట్టుకుని తిరుగుతున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కేజీ టు పీజీ వరకు ఉన్న సబ్జెక్టులను మారుస్తాం, విద్యారంగాన్ని ప్రక్షళన చేస్తాం. చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా సిలబస్ ను మారుస్తాం. 

ఫీజు రీయింబర్స్ మెంట్ ను పునరుద్ధరించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తాం. వైసీపీ పాలనలో ఫీజు రీయింబర్స్ రద్దు వల్ల ఫీజులు కట్టలేక కోర్సు పూర్తిచేసి, కాలేజీలోనే సర్టిఫికెట్లు వదిలేసిన విద్యార్థులకు మేం అధికారంలోకి వచ్చాక కాలేజీలకు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద ఫీజులు కట్టి సర్టిఫికెట్లు ఇప్పిస్తాం" అని భరోసా ఇచ్చారు.

యువత మేనిఫెస్టో తీసుకువస్తున్నాం!

తన పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకు ఓ హామీ ఇస్తున్నట్టు లోకేశ్ వెల్లడించారు. తన పాదయాత్ర 100వ రోజు యువతకు సంబంధించిన మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు ఉద్యోగాలు కల్పించేదానిపై దృష్టి పెడతారని, జగన్ కమీషన్లు, వాటాల కోసం ఆశపడతాడని వ్యాఖ్యానించారు. "ఏపీ అభివృద్ధి కేవలం తెలుగుదేశం పాలనలోనే జరిగింది. వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది. హైదరాబాద్ లో చంద్రబాబు ఐటీని ప్రోత్సహించడం వల్ల నేడు ఐటీ హబ్ గా వెలుగొందుతోంది. జగన్ మరోసారి గెలిస్తే దక్షిణ భారత దేశ బీహార్ గా ఏపీ మారుతుంది. 

ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి దోచుకునే పనిలోనే ఉన్నాడు జగన్. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ ఓటే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవరు గెలిస్తే మీకు భవిష్యత్తు ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జీఎస్టీ కలెక్షన్ లో మనం ఒరిస్సా కంటే వెనుకబడి ఉన్నాం" అని వివరించారు.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 990.7 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 13.9 కి.మీ.*

*77వరోజు (21-4-2023) యువగళం వివరాలు:*

*ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా)*

ఉదయం

7.00 – ఆదోని శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.15 – ఆదోని బైపాస్ క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

9.10 – ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి వద్ద స్టూడెంట్స్ జెఎసి ప్రతినిధులతో భేటీ.

9.50 – ఆదోని దర్గా వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

10.10 – ఎమ్మిగనూరు సర్కిల్ లో మెకానిక్స్ అసోసియేషన్ తో సమావేశం.

10.35 – ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముస్లిం సామాజికవర్గీయులతో భేటీ.

10.50 – రైల్వేస్టేషన్ రోడ్డులో స్థానికులతో మాటామంతీ.

11.05 – అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్ పిఎస్ ప్రతినిధులతో సమావేశం.

11.20 – గవర్నమెంట్ హాస్పటల్ వద్ద ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ.

11.40 – మేదరగిరి బ్రిడ్జి వద్ద స్థానికులతో మాటామంతీ.

మధ్యాహ్నం

12.45 – ఆదోని రామాలయం వద్ద భోజన విరామం.

సాయంత్రం

3.15 – ఆదోని రామాలయం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.

*3.25 – ఆదోని సిరిగుప్ప క్రాస్ వద్ద 1000 కి.మీ.కు చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.*

5.00 – ఆదోని కడికొత్త క్రాస్ వద్ద బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.

6.15 – ఆదోని కడికొత్త క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.

More Telugu News