Andhra Pradesh: రెండో రోజు లాయర్లతో కలిసి సీబీఐ ఎదుటకు అవినాశ్ రెడ్డి

  • వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ
  • నిన్న 8 గంటల పాటు ఎంపీని ప్రశ్నించిన సీబీఐ అధికారులు
  • ఈ కేసులో 25వ తేదీ వరకు అవినాశ్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు
Avinash Reddy appears before CBI with his advocates

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వరుసగా రెండో రోజు సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం తన నివాసం నుంచి అవినాశ్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎంపీని విచారించనున్నారు. ఈ రోజు అవినాశ్ రెడ్డి తన న్యాయవాదులతో కలిసి వచ్చారు. నిన్న అవినాశ్ ను సీబీఐ అధికారులు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. 

వివేకా హత్యకు గురైన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీసినట్టు సమాచారం. ఆయన రాజకీయ అరంగేట్రం, కేసులో అనుమానితులు, నిందితులుగా ఉన్న వారితో సంబంధాల గురించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో రోజు అవినాశ్ కు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, ఈ కేసులో ఈ నెల 25వ తేదీ వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్ట్ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ రోజు సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాశ్ కు సూచించింది.

More Telugu News