Sunil Deodhar: సీబీఐ విచారణను పరిశీలిస్తే వైసీపీతో బీజేపీకి సంబంధం లేదనే విషయం తెలిసిపోతుంది: సునీల్ దేవధర్

  • జగన్ సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమన్న సునీల్ దేవధర్
  • దర్యాప్తు సంస్థలను కేంద్రం ఎప్పుడూ దుర్వినియోగం చేయదని వ్యాఖ్య
  • టీటీడీలో అన్య మతస్తులకు ఉద్యోగాలు ఇచ్చే నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ 
Sunil Deodhar comments on Jagan

ఏపీలో ఫ్యాక్టనిస్ట్ ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ అన్నారు. ఏపీకి జగన్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో తప్పు చేసిన వారు కచ్చితంగా జైలుకు వెళ్తారని... జగన్ తప్పు చేసినా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. సీబీఐ కేసు విచారణను పరిశీలిస్తే వైసీపీతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదనే విషయం తెలుస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థలను ఎప్పుడూ దుర్వినియోగం చేయదని, చట్టం తన పనిని తాను చేసుకుపోతుందని అన్నారు. 

ఏపీ ప్రభుత్వం తెలుగు భాషను చంపేస్తోందని సునీల్ దేవధర్ విమర్శించారు. తెలుగు, సంస్కృత పాఠశాలలను మూసివేసి... ఇంగ్లిష్ మీడియం విద్య ద్వారా క్రైస్తవ మతాన్ని పెంచాలనుకుంటున్నారని విమర్శించారు. మతమార్పిడికి ఇదొక మార్గమని చెప్పారు. టీటీడీలో అన్య మతస్తులకు ఉద్యోగాలు ఇచ్చేలా నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోకపోతే బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు. ఏడుకొండల వాడితో పెట్టుకున్న వాళ్లెవరూ బాగుపడినట్టు చరిత్రలో లేదని వ్యాఖ్యానించారు.

More Telugu News