Mukul Roy: బెంగాల్‌లో ముకుల్‌రాయ్ చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు.. బీజేపీపై ముకుల్ కుమారుడి ఫైర్

Senior Trinamool Leader Expresses Desire To Join BJP
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలు ఇప్పుడు టీఎంసీ సీనియర్ నేత ముకుల్‌రాయ్ చుట్టూ తిరుగుతున్నాయి. బీజేపీలో చేరబోతున్నట్టు ఆయన ప్రకటిస్తే.. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనతో ఈ నీచ రాజకీయాలు ఏంటంటూ ఆయన కుటుంబం బీజేపీపై విరుచుకుపడుతోంది. ముకుల్ రాయ్ గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారన్న రాజకీయ నిపుణుల ఊహాగానాలను నిజం చేస్తూ గత రాత్రి ఢిల్లీలో కీలక ప్రకటన చేశారు. తానింకా బీజేపీ శాసనసభ్యుడిగానే ఉన్నానని, పార్టీలోకి తిరిగి వెళ్లిపోతున్నట్టు చెప్పారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అమిత్‌షాను కలుస్తానని చెప్పుకొచ్చారు. 

‘వ్యక్తిగత పనుల’ నిమిత్తం సోమవారం రాత్రి ముకుల్ రాయ్ ఢిల్లీ వెళ్లారు. అయితే, అంతకుముందు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ‘కనిపించకుండా’ పోయారని, ఎక్కడున్నారో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముకుల్ ఆరోగ్యం బాగా లేదని, ఆలోచనలు సరిగా లేని వ్యక్తితో బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. 

అయితే, ముకుల్ రాయ్ మాత్రం తానింకా బీజేపీ శాసనసభ్యుడినేనని, తాను బీజేపీతోనే ఉండాలని అనుకుంటున్నానని తేల్చి చెప్పారు. తానిక్కడ ఉండేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అమిత్ షాను కలవాలనుకుంటున్నానని, పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో మాట్లాడాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నట్టు బెంగాల్ న్యూస్ చానల్ పేర్కొంది. 

2017లో పార్టీ వీడి.. 2021లో తిరిగి టీఎంసీ చెంతకు
టీఎంసీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్ రాయ్ 2017లో బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత ఆయన బీజేపీకి రాజీనామా చేయకుండానే తిరిగి టీఎంసీ గూటికి చేరుకున్నారు. తనకు కొంతకాలంగా ఆరోగ్యం సరిగా లేదని, కాబట్టే రాజకీయాలకు దూరంగా ఉన్నానని ముకుల్ రాయ్ చెప్పారు. అయితే, ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడిందని, రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అయ్యానని చెప్పుకొచ్చారు. తాను టీఎంసీతో సంబంధం పెట్టుకోనని వందశాతం నమ్మకంతో ఉన్నానని అన్నారు. అంతేకాదు, తన కుమారుడు సుభరంగ్‌సును కూడా బీజేపీలో చేరాలని కోరారు. ఆ పార్టీ ఆయనకు సరిగ్గా సరిపోతుందన్నారు. 

మెదడుకు సర్జరీ తర్వాత ఎవరినీ గుర్తు పట్టడం లేదు
సుభరంగ్‌సు మాత్రం తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, అలాంటి వ్యక్తిని పట్టుకుని రాజకీయాలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి అదృశ్యమైన తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానన్నారు. గత నెలలో తన తండ్రి మెదడుకు సర్జరీ జరిగిందని, ఆ తర్వాతి నుంచి ఆయన కుటుంబ సభ్యులను, సన్నిహితులను కూడా గుర్తించలేకపోతున్నారని అన్నారు. 

ఇది సరికాదు
ఇదే విషయమై బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత సోవాన్‌దేబ్ ఛటోపాధ్యాయ్ మాట్లాడుతూ.. ముకుల్ రాయ్ తనకు కొన్ని దశాబ్దాలుగా తెలుసన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎవరినీ గుర్తు పట్టలేకపోతున్నారని, అలాంటి వ్యక్తితో నీచ రాజకీయాలకు పాల్పడడం బీజేపీకి తగదని హితవు పలికారు.
Go Back to Shorts
Mukul Roy
West Bengal
TMC
BJP

More Telugu News