Adimulapu Suresh: వివేకా హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్

  • చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న ఆదిమూలపు సురేశ్
  • ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని గతంలో సీఎం జగనే చెప్పారని వెల్లడి
  • దోషులు ఎవరైనా బయటకు రావాల్సిందేనని వ్యాఖ్య
minister adimulapu suresh comments on cbi enquiry in ys viveka murder case

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సన్నిహితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన 48 గంట్లలోనే ఆదివారం అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 

ఈ వ్యవహారంపై ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని గతంలో సీఎం జగనే చెప్పారని తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని అన్నారు. దోషులు ఎవరైనా బయటకు రావాల్సిందేనని పేర్కొన్నారు. ‘‘మేమే కదా.. మా ముఖ్యమంత్రిగారే కదా సీబీఐకి ఇవ్వాలని చెప్పింది. దోషులెవరైనా బయటికి రావాల్సిందే’’ అని అన్నారు.

మరోవైపు భాస్కర్ రెడ్డిని కట్టుదిట్టమైన భద్రత మధ్య సీబీఐ కోర్టులో హాజరుపరిచేందుకు హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రంలోపు భాస్కర్ రెడ్డిని సీబీఐ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ వార్త తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు.

More Telugu News