Botsa Satyanarayana: కోడికత్తి కేసులో ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి.. మీ రాతలేంటి?.. బొత్స సత్యనారాయణ మండిపాటు

  • ఎన్‌ఐఏ రిపోర్టును కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయన్న బొత్స
  • కోడి కత్తి దాడి జగనే చేయించుకున్నారన్న భావన కల్పిస్తున్నాయని అసహనం
  • అలిపిరిలో రాజకీయ లబ్ధి కోసమే బాబు దాడి చేయించుకున్నారా? అని ప్రశ్న
ap minister botsa satyanarayana on kodikatti case

కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ రిపోర్టును కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కోడి కత్తి దాడి జగనే చేయించుకున్నారన్న భావన కల్పిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడి వాస్తవమని అన్నారు. 

జగన్‌ పై ఎయిర్ పోర్ట్‌లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని బొత్స అన్నారు. కోడికత్తి దాడికి పాల్పడిన శ్రీనివాస్ ఏ ఉద్దేశ్యంతో చేశాడో తెలియాలన్నారు. ఎన్‌ఐఏ రిపోర్ట్‌లో ఏముందో ఎలా తెలిసిందని మంత్రి బొత్స ప్రశ్నించారు. 

‘‘ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి..? మీరు రాసిన రాతలేంటి? జగన్ తన రాజకీయ స్వలాభం కోసమే దాడి చేయించుకున్నాడని ఉందా? ఎన్ఐఏ వచ్చి చెప్పిందా మీకు?’’ అని నిప్పులు చెరిగారు. అలిపిరిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్సల్స్ దాడి చేశారని.. అది కూడా రాజకీయ లబ్ధి కోసం బాబు చేయించుకున్నారా? అని నిలదీశారు.

విశాఖ ఉక్కుపై తమ విధానం ఒక్కటేనని, ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని బొత్స స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ దెబ్బకు ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోయిందనేది అవాస్తవమని చెప్పుకొచ్చారు. అఖిలపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదని.. అందుకే విశాఖ స్టీల్ విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లటం లేదని తెలిపారు. అఖిలపక్ష పార్టీలపై తమకు విశ్వాసం లేదని చెప్పారు.

More Telugu News