Kollu Ravindra: గుడివాడ రోడ్ షో కమ్మ షో అని నీచమైన ప్రచారం చేస్తున్నారు: కొల్లు రవీంద్ర

  • కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు అన్న రవీంద్ర
  • సీట్ కోసం చంద్రబాబు కాళ్ల మీద పడ్డారని ఎద్దేవా
  • కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే నీచ మనస్తత్వం కలిగిన వ్యక్తి అని మండిపాటు
Kolly Ravindra fires on Kodali Nani

గుడివాడలో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో కమ్మ షో అంటూ నీచమైన ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. రోడ్ షోలో అన్ని సామాజికవర్గాల ప్రజలు పాల్గొన్నారని చెప్పారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది, ఎమ్మెల్యే చేసింది చంద్రబాబు అని అన్నారు. సీట్ కోసం చంద్రబాబు కాళ్ల దగ్గర పడిన విషయం కొడాలి నానికి గుర్తు లేదా అని ప్రశ్నించారు. కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెట్టే నీచ మనస్తత్వం కలిగిన వ్యక్తి కొడాలి నాని అని అన్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను పెట్టించింది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పారు. 

మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ, మహిళల గురించి కూడా నీచంగా మాట్లాడే కొడాలి నాని లాంటి వ్యక్తులకు భూమిపై ఉండే అర్హత లేదని అన్నారు. చంద్రబాబు కాళ్లపై పడి కొడాలి నాని బీఫామ్ తీసుకున్నారని చెప్పారు.

టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు గుడివాడ పర్యటన విజయవంతం కావడంతో కొడాలి నానికి కళ్లు బైర్లు కమ్మాయని ఎద్దేవా చేశారు. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటో కొడాలి నానికి అర్థమయిందని, అందుకే పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు. గుడివాడకు చంద్రబాబు ఎన్నో మంచి పనులు చేశారని... ఆయన చేసిన ఒకే ఒక చెడ్డ పని కొడాలి నానికి టికెట్ ఇవ్వడమేనని అన్నారు.

More Telugu News