Jai Shankar: ఇది మరో భారత్: పొరుగు దేశాలకు జై శంకర్ వార్నింగ్

  • చైనా, పాకిస్థాన్ లను ఉద్దేశించి జై శంకర్ ఘాటు హెచ్చరికలు
  • దెబ్బకు దెబ్బ తీస్తామని స్పష్టీకరణ
  • చైనా, పాక్ సవాళ్లను అణచివేసే శక్తి నవ్య భారత్ కు ఉందని వెల్లడి
  • భారత్ ను ఏ శక్తులూ ఒత్తిడికి గురిచేయలేవని ఉద్ఘాటన
Foreign Minister Jai Shankar neighbours warns this another India

ఎంతో సౌమ్యుడిగా పేరుగాంచిన కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తన మాటల్లో పదును పెంచారు. తాజాగా పాకిస్థాన్, చైనాలను ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు. భారత్ కు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి సరిహద్దు ఉగ్రవాదంలో పాలుపంచుకుంటున్న శక్తులకు ఇప్పుడున్నది మరో భారత్ అని తెలుస్తుందని, చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని జై శంకర్ స్పష్టం చేశారు. 

ఉగాండాలో భారతీయ సమాజంతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశం కొత్త భారతదేశంగా రూపాంతరం చెందుతోందని, పాక్, చైనాల నుంచి దేశ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను అణచివేసే శక్తి ఈ నవ భారతావనికి ఉందని ఉద్ఘాటించారు. యూరీ, బాలాకోట్ ఉదంతాలు ఈ విషయాన్ని చాటిచెబుతాయని జై శంకర్ వివరించారు. 

దశాబ్దాల తరబడి సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ సహించిందని, ఈ నూతన భారతదేశంతో ఇక వారి ఆటలు సాగవన్న విషయం తెలిసి వస్తుందని అన్నారు. గత మూడేళ్లుగా చైనా సరిహద్దు ఒప్పందాల అతిక్రమణలకు పాల్పడుతోందని, భారీగా దళాలను రంగంలోకి దింపుతోందని ఆరోపించారు. కానీ ఇవాళ భారత సైన్యం క్లిష్ట పరిస్థితుల్లో సైతం, అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రాల్లోనూ సన్నద్ధత చాటుతోందని జై శంకర్ వివరించారు. 

"గతంలో మాదిరి కాదు... భారత సైనికులకు ఇప్పుడు పూర్తి మద్దతు ఉంది. వారి వద్ద సరైన ఆయుధాలు ఉన్నాయి, తగిన మౌలిక సదుపాయాలు, వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి" అని స్పష్టం చేశారు. స్వీయ ప్రయోజనాలకు భంగం కలిగితే ఇప్పటి భారతదేశం ఎంతమాత్రం ఉపేక్షించదన్న విషయాన్ని తక్కిన ప్రపంచం గుర్తించాలని అన్నారు. 

ఇవాళ భారత్ ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా నిలబడిందని తెలిపారు. ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలి? ఎవరి నుంచి చమురు కోనుగోలు చేయకూడదు? వంటి అంశాలను ఇప్పుడు మనకు ఎవరూ నిర్దేశించలేరని, భారత్ ను ఒత్తిడికి గురిచేసే శక్తులేవీ లేవని జై శంకర్ ఉద్ఘాటించారు.

More Telugu News