Chandrababu: 90 శాతం వైకల్యం ఉన్న యువతికి పెన్షన్ తొలగించడమే మీ మానవత్వమా?: చంద్రబాబు మండిపాటు

  • సీమ పర్వీన్ కు పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చిందని ప్రశ్నించిన చంద్రబాబు
  • మీరు, మీ ప్రభుత్వానిదే వైకల్యమంటూ విమర్శ
  • బాధితురాలితో కలిసి సెల్ఫీ చాలెంజ్ విసిరిన టీడీపీ అధినేత 
tdp chief nara chandrababu naidu fires on seema parvin pension cancellation

దివ్యాంగురాలికి పెన్షన్ తొలగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పింఛన్ తీసేసేందుకు జగన్ కు మనసెలా వచ్చిందని ప్రశ్నించారు. బాధితురాలితో కలిసి చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్ విసిరారు.

‘‘విభిన్న ప్రతిభావంతురాలైన సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చింది? 18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రుల చేతులపై పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా?’’ అని ట్వీట్టర్ లో చంద్రబాబు నిలదీశారు. 

‘‘పెన్షన్ కు నాడు అర్హురాలు, నేడు అనర్హురాలు ఎలా అయ్యింది? 90శాతం వైకల్యం ఉన్న ఆమెకు నిబంధనల పేరుతో పెన్షన్ తొలగించడమే మీ మానవత్వమా? వాస్తవంగా చెప్పాలంటే వైకల్యంతో ఉంది ఆమె కాదు.. మీరు, మీ ప్రభుత్వం’’ అని మండిపడ్డారు. సీమ పర్వీన్ కు మంజూరు చేసిన పింఛన్ పుస్తకం, ఆమెతో తీసుకున్న ఫొటోను చంద్రబాబు పోస్టు చేశారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వార్డు నంబర్ 22లో సీమ పర్వీన్ నివసిస్తోంది. మానసిక ఎదుగుదలతో పాటు శారీరక ఎదుగుదల లేదు. 18 ఏళ్లు వచ్చినా ఆమె తల్లిదండ్రులపైనే ఆధారపడి జీవిస్తోంది. సీమ పర్వీన్ కు టీడీపీ హయాంలో ఎన్టీఆర్ భరోసా కింద రూ.1,500 పింఛన్ అందించేవారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత పింఛన్ ఇవ్వడం లేదు. పింఛన్ జాబితాలో ఆమె పేరును తొలగించారు.

మచిలీపట్నంలో జరిగిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీమ పర్వీన్ కుటుంబం చంద్రబాబును కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఆమె పరిస్థితిని చూసిన చంద్రబాబు చలించిపోయారు. తొలగించిన ఫించన్ రూ.36 వేలు ఇస్తామని ప్రకటించారు.

More Telugu News