Nicholas Pooran: పూరన్ ధనాధన్... చివరి బంతికి లక్నో విన్

  • చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వెల్లువ
  • లక్నో సూపర్ జెయింట్స్ లక్ష్యం 213 రన్స్
  • 30 బంతుల్లో 65 పరుగులు చేసిన స్టొయినిస్
  • ఆ తర్వాత 19 బంతుల్లోనే 62 పరుగులు చేసిన పూరన్
  • చివరి ఓవర్లో విజయానికి 5 పరుగులు అవసరం
  • రెండు వికెట్లు కోల్పోయినా ఆఖరి బంతికి సింగిల్ తో లక్నో విజయం
Pooran sensational batting makes LSG victorious against RCB

భారీ స్కోర్ల మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ సంచలన విజయం సాధించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పరుగుల వర్షంలో తడిసి ముద్దయిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క వికెట్ తేడాతో విజేతగా నిలిచింది. 

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన 213 పరుగుల లక్ష్యఛేదనలో మార్కస్ స్టొయినిస్ ఇన్నింగ్స్ సూపర్ జెయింట్స్ కు ప్రాణం పోస్తే.... ఆ తర్వాత వచ్చిన నికోలాస్ పూరన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా ఊచకోత కోశాడు. పూరన్ కేవలం 19 బంతుల్లోనే 62 పరుగులు చేశాడంటే అతడి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ.

పూరన్ 4 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు.  పూరన్ ఉన్నంత సేపు మైదానం హోరెత్తిపోయింది. చివరికి సిరాజ్ బౌలింగ్ లో లాంగ్ లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 

పూరన్ అవుటైన తర్వాత పరిస్థితి మారిపోయింది. మరో ఎండ్ లో ఉన్న ఆయుష్ బదోనీ కూడా వీరోచితంగా పోరాడాడు. ఓ అద్భుతమైన సిక్స్ కొట్టినా, అదే బంతికి హిట్ వికెట్ కావడంతో తీవ్ర నిరాశతో పెవిలియన్ చేరాడు. 

చివరి ఓవర్లో సూపర్ జెయింట్స్ విజయానికి 5 పరుగులు కావాల్సి ఉండగా, రెండు వికెట్లు పడిపోయాయి. ఆఖరి బంతికి ఒక రన్ కొడితే గెలుస్తారనగా... బౌలర్ హర్షల్ పటేల్ నాన్ స్ట్రయికింగ్ లో ఉన్న బిష్ణోయ్ ని మన్కడింగ్ ద్వారా అవుట్ చేసే ప్రయత్నం చేశాడు కానీ సాధ్యం కాలేదు. ఇక చివరి బంతి వికెట్ కీపర్ కు చేరినా.... క్రీజులో ఉన్న అవేశ్ ఖాన్, నాన్ స్ట్రయికర్ బిష్ణోయ్ మెరుపువేగంతో పరిగెత్తి లక్నో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. 

ఐపీఎల్ లో ఎలాంటి పోటీ ఉంటుందో చెప్పేందుకు ఈ మ్యాచ్ సిసలైన ఉదాహరణలా నిలుస్తుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. కోహ్లీ 61, డుప్లెసిస్ 79 (నాటౌట్), మ్యాక్స్ వెల్ 59 పరుగులు చేశారు. 

ఇంత భారీ స్కోరు సాధించడం, పైగా సొంతగడ్డపై ఆడుతుండడంతో ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టే గెలుస్తుందని అందరూ భావించారు. దానికి తగ్గట్టు లక్నో జట్టు లక్ష్యఛేదనలో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు గెలుపుపై ఎవరికీ నమ్మకం కలగలేదు. 

కానీ మార్కస్ స్టొయినిస్ రాకతో పరిస్థితి మారిపోయింది. బంతిని బలంగా బాదడంలో దిట్ట అయిన స్టొయినిస్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో నికోలాస్ పూరన్ విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. యువ ఆటగాడు ఆయుష్ బదోనీతో కలిసి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ దాడులను తుత్తునియలు చేశాడు. బదోనీ 24 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. 

బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 3, వేన్ పార్నెల్ 3, హర్షల్ పటేల్ 2, కర్ణ్ శర్మ 1 వికెట్ తీశారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక లక్ష్యఛేదన. ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

More Telugu News