Nalgonda District: ప్రేమికుడిని వెంటాడి.. పట్టపగలే నడిరోడ్డుపై నరికి చంపిన యువతి బంధువులు!

  • యువతిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న యువకుడు
  • హెచ్చరించిన యువతి బంధువులు
  • మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన యువకుడి స్నేహితులు
  • వస్తూనే కత్తులతో దాడిచేసిన 9 మంది
  • ఘటనా స్థలంలోనే మృతి చెందిన యువకుడు
Dreaded Murder in Nalgonda

నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో నిన్న మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే దారుణం జరిగింది. ఓ యువకుడిని వెంటాడిన కొందరు వ్యక్తులు నడిరోడ్డుపైనే అతడిని దారుణంగా పొడిచి చంపారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. త్రిపురారం మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇరిగి నవీన్ (21) మిర్యాలగూడలో కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతి (20)ని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఆమెకు ఇంట్లో సంబంధాలు చూస్తున్న విషయం తెలిసిన నవీన్ ఇటీవల విషం తాగి ఆసుపత్రి పాలయ్యాడు. చికిత్స అనంతరం కోలుకున్నాడు.

నవీన్ ప్రేమ విషయం తెలుసుకున్న యువతి బంధువులు యువకుడికి ఫోన్ చేసి ఆమెను మర్చిపోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలో నవీన్ నిన్న అన్నారంకే చెందిన మిత్రుడు ఈట అనిల్‌తో కలిసి నిడమనూరు మండలం గుంటిపల్లికి చెందిన పాల్వాయి తిరుమల్ వద్దకు వచ్చి అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి తమ పెళ్లికి ఒప్పించాలని కోరాడు.

సరేనన్న తిరుమల్ యువతి బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పి మాట్లాడుకుందాం రమ్మన్నాడు. సరేనన్న యువతి బంధువులు 9 మంది మూడు బైకులుపై అక్కడికి చేరుకున్నారు. వస్తూనే నవీన్‌పై కత్తులతో దాడికి పాల్పడ్డారు. తిరుమల్, అనిల్‌ను బెదిరించడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. 

నవీన్ కూడా భయంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొంత దూరం వెళ్లాక కిందపడిపోయాడు. అతడిని పట్టుకున్న నిందితులు చాతీ, పొట్ట భాగాల్లో విచక్షణ రహితంగా పొడిచారు. అది చూసి స్థానికులు అక్కడికి వచ్చేసరికే నవీన్ మృతి చెందాడు. నవీన్ మిత్రుడు అనిల్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News