Telangana: 24/7 నిబంధన అన్ని దుకాణాలకు వర్తించదు.. స్పష్టతనిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

  • ఇటీవల జీవో నంబరు 4ను విడుదల చేసిన ప్రభుత్వం
  • దుకాణాలను 24 గంటలు తెరిచిపెట్టుకునే నిబంధన అన్నింటికీ వర్తించదని స్పష్టీకరణ
  • ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖకు ఈ జీవో వర్తించదన్న కార్మిక శాఖ కార్యదర్శి 
Telangana Govt Gave Clarity about G O No 4

రాష్ట్రంలోని దుకాణాలన్నీ వారంలో 24 గంటలు తెరిచిపెట్టుకోవచ్చన్న నిబంధన విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలోని దుకాణాలన్నీ ఇకపై 24 గంటలు తెరిచిపెట్టుకోవచ్చంటూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 1988 కింద పేర్కొన్న దుకాణాలు, సంస్థలకు సెక్షన్ 7 (దుకాణాలు తెరవడం, మూసివేసే గంటలు) నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, ఇందుకు సంబంధించి కొన్ని షరతులను కూడా ప్రభుత్వం విధించింది. ఆయా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, దుకాణదారులు తమ ఉద్యోగులకు ఐడీ కార్డులు ఇవ్వాలి. వారాంతపు సెలవులు ఇవ్వడంతోపాటు వారానికి వారి పనిగంటలను నిర్దేశించాలి. షిఫ్ట్‌కు మించి పనిచేస్తే ఎన్ని గంటలు పనిచేసిందీ లెక్కగట్టి అదనపు వేతనం చెల్లించాలి.

ఇప్పుడీ విషయంలో రాష్ట్ర కార్మిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని మరింత స్పష్టతనిచ్చారు. జీవో నంబరు 4 కింద ఇచ్చిన 24 గంటలు దుకాణాలు తెరిచి పెట్టుకునే నిబంధన ఆటోమెటిక్‌గా అన్నింటికీ వర్తించదన్నారు. ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత మాత్రమే దుకాణాలను 24 గంటలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అయితే, ఈ జీవో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖకు వర్తించదన్నారు. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల ప్రకారం టీఎస్‌బీసీఎల్, ఐఎంఎఫ్ఎల్ డిపోలు, డిస్టిలరీలు, ఏ4 షాపులు, 2బీ బార్లు ప్రత్యేక సమయం ప్రకారం మాత్రమే తెరిచి ఉంటాయని రాణి కుముదిని తెలిపారు.

More Telugu News