Nara Lokesh: పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే... రిబ్బన్ కట్ చేసేది చంద్రబాబే: నారా లోకేశ్

  • కొనసాగుతున్న లోకేశ్ యువగళం పాదయాత్ర
  • అనంతపురం జిల్లాలో రైతన్నతో లోకేశ్ కార్యక్రమం
  • వ్యవసాయంపై తన మనోభావాలను పంచుకున్న టీడీపీ అగ్రనేత
  • వీడియో ద్వారానూ రైతులతో మాట్లాడిన లోకేశ్
Nara Lokesh met farmers and answers their questions

పోలవరాన్ని 72 శాతం పూర్తి చేసింది చంద్రబాబేనని, మిగిలింది కూడా పూర్తి చేసి రిబ్బన్ కట్ చేసేది కూడా చంద్రబాబేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పోలవరం పూర్తి చేస్తానని చెప్పి జగన్ నాలుగు తేదీలు ఇచ్చాడని, ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు కదల్లేదని విమర్శించారు. 

అనంతపురంజిల్లా, శింగనమల నియోజకవర్గం, జంబులదిన్నె కొట్టాల యువగళం క్యాంప్ సైట్ లో ‘‘రైతన్నతో లోకేశ్’’ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. వ్యవసాయరంగంపై తెలుగుదేశం పార్టీ విధివిధానాలను స్పష్టంగా, నిజాయతీగా అన్నదాతల ముందుంచారు. 

జంబులదిన్నెలో చుట్టూ కొండలు, పంటపొలాల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో హలో లోకేశ్ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ చింతపల్లి రామ్ ప్రసాద్ హోస్ట్ గా వ్యవహరించారు. 


ప్రశ్న: మీకు రైతన్నతో లోకేశ్ నిర్వహించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి?

లోకేశ్: టీడీపీ పాలనలో రైతులపై తలసరి అప్పు రూ.70 వేలు ఉంటే నేడు వైసీపీ పాలనలో అది రూ.2.50 లక్షలకు చేరింది. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానం, కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వస్థానానికి ఏపీ జగన్ రెడ్డి పాలనలో వెళ్లింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే రైతులు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ‘‘రైతన్నతో లోకేశ్’’ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రైతన్న ఆనందంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మే వ్యక్తిని నేను. రాష్ట్రంలో 70 శాతం ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి అండగా నిలవడం నా బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను.

ప్రశ్న: ఇప్పటికి మీరు 800కిలోమీటర్లు పాదయాత్ర పూర్తిచేశారు. ఈ ప్రయాణంలో రైతులను కలిసి అనేక విషయాలు మీరు తెలుసుకున్నారు. వాటిలో మీ మనసును హత్తుకున్న విషయం ఏదైనా ఉందా?

లోకేశ్: నా పాదయాత్రలో ఓ రైతును కలిసినపుడు అడిగాను. ఆ రైతు స్పందిస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.12.5లక్షల అప్పులు చేయాల్సి వచ్చింది. ఎరువులు, పురుగుమందులు, పెట్టుబడులు పెరగడంవల్లే అప్పులపాలయ్యానన్నాడు. ఆరునెలల క్రితం ఆయన భార్య కూడా క్యాన్సర్ తో మరణించింది. ఆ బాధ ఒకవైపు, అప్పుల బాధ మరోవైపుతో సతమతమవుతూ  మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తే ఆత్మహత్యే శరణ్యమని చెప్పిన మాటలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. 

ప్రశ్న:నందమూరి తారకరామారావు వేషధారణలో ఓ సంపూర్ణ రైతు కనిపించారు. మీకు అలా ఉండాలని ఎప్పుడైనా అనిపించిందా? ఆ వస్త్రధారణ మీరు అవలంభిస్తారా?

లోకేశ్: రైతులకు సంపూర్ణ న్యాయం చేసిన నాడు నేను కచ్చితంగా రైతన్న వస్త్రధారణ చేస్తాను. అప్పుడే నాకు పూర్తిగా సంతృప్తి కలుగుతుంది.

ప్రశ్న: మీరే సొంతంగా వ్యవసాయం చేసి, ఇందులో ఉన్న కష్టసుఖాలు తెలుసుకోవాలనే కోరిక ఏమైనా ఉందా?

లోకేశ్: రైతులు ఎదుర్కొనే ఇబ్బందులు నేను తట్టుకోలేను. రైతులు పడిన, పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న తర్వాత రైతుల పట్ల ప్రేమ మరింత పెరిగింది. వారికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసి, అధికారంలోకి వచ్చాక రైతన్నలకు వెన్నుముకలా నిలబడాలని బలంగా నిర్ణయం తీసుకున్నాను.

ప్రశ్న:మీరు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకోలేకపోతే వాటిని భవిష్యత్తులో మేం నిలదీయవచ్చా?

లోకేశ్: రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి చంద్రబాబు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వారిని ఎలా ఆదుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నారు. సీఎం అయిన వెంటనే త్వరితగతిన రైతుల సమస్యల్ని పరిష్కరిస్తారనే విషయాన్ని రాసిపెట్టుకోండి. నేను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నన్ను నిలదీయవచ్చు. అదేవిధంగా హామీలను నెరవేరిస్తే మీరే నన్ను అభినందించండి.

ప్రశ్న:మీరు రైతు కాదు. వ్యవసాయం తెలియదు. రైతుల సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు?

లోకేశ్: నా పాదయాత్రలో రైతులు పడుతున్న ఇబ్బందులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా రైతుల సమస్యలపై అనేక కార్యక్రమాలు చేసి రైతులను ఆదుకున్నాం. రైతులకు లాభాలు వచ్చే విధానాలను అమలు చేసి రైతులను ఆత్మహత్యల బారి నుండి బయటకి తెచ్చి ఆదుకుంటాం. మంత్రిగా ఉన్నప్పుడు రైతుల పంటలను ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా మార్కెటింగ్ చేసి వారికి లాభాలు తెచ్చిన అనుభవం ఉంది. మిగిలిన పంటలను కూడా అదేవిధానంలో మార్కెటింగ్ చేస్తాం. రైతులను లాభాల బాటలో నడిపిస్తాం. హెరిటేజ్ కంపెనీ ద్వారా రైతులను నాకు నేరుగా సంబంధాలున్నాయి. వారి సమస్యలపైనా అవగాహన ఉంది. ఈ అనుభవాలన్నీ రైతులను ఆదుకునేందుకు నాకు ఉపయోగపడతాయి.

ప్రశ్న:దేవాన్ష్ వ్యవసాయం వైపు వస్తానంటే మీరు ప్రోత్సహిస్తారా?

లోకేశ్: దేవాన్ష్ వ్యవసాయం చేస్తానంటే తప్పకుండా స్వాగతిస్తా, ప్రోత్సహిస్తా. కానీ నాకు ఉన్న అనుభవాలు దృష్ట్యా సలహాలు కూడా ఇస్తా. వ్యవసాయాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం నేర్పిస్తా. తండ్రిగా అది నా బాధ్యత.

ప్రశ్న:వ్యవసాయానికి టెక్నాలజీని ఎలా అనుసంధానం చేస్తారు?

లోకేశ్:నేటి కాలంలో ఇంట్లో కూర్చుని బటన్ నొక్కితే అన్నీ మన కాళ్లదగ్గరకే వస్తున్నాయి. వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు, ట్రాక్టర్లు వంటి యంత్ర పరికరాలను కూడా బటన్ నొక్కి రైతుల ఇళ్ల వద్దకే పంపేలా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయాన్ని టెక్నాలజీతో లాభసాటి చేసే విధానాలను అందుబాటులోకి తెస్తాం.

ఇవే కాకుండా వీడియో ద్వారా రైతులు అడిగిన ప్రశ్నలకు కూడా లోకేశ్ సమాధానాలు ఇచ్చారు. 

  • ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కౌలురైతులకు అందడం లేదు. మేం అధికారంలోకి వచ్చాక కౌలు రైతులను ఆదుకునే ఓ కార్యాచరణను ప్రకటిస్తాం. ఇన్ పుట్ సబ్సిడీ మొదలు గిట్టుబాటు ధర కల్పించే వరకు అనేక అంశాల్లో కౌలురైతులను ఆదుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తాం. టీడీపీ పాలనలో రైతులను, కౌలురైతులను సమానంగా ఆదుకుంటాం.  
  • తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉండగా నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే నకిలీ విత్తనాలను అరికడతాం. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటాం. విత్తనాలను టెస్టు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తాం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం.  
  • హంద్రీనీవా ప్రాజెక్టును 90శాతం చంద్రబాబు పూర్తి చేశారు. మిగిలిన 10 శాతాన్ని కూడా మేం పూర్తిచేసి మీ చెరువులకు నీరు అందిస్తాం. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు పుష్కలంగా సాగునీరు అందించారు. పోలవరాన్ని కూడా చంద్రబాబు 72 శాతం పూర్తిచేశారు. దాన్ని కూడా పూర్తిచేసి గోదావరి నీళ్లను రాయలసీమకు తెస్తాం. ర్తిచేసి రాయలసీమలో గడప గడపకు తాగునీటిని అందిస్తాం. 
  • నేను వ్యవసాయ మంత్రిని అయితే వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తాం. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, యంత్ర పరికరాలు, వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై రైతులకు అందిస్తా. అనంతపురం అరటి పంట విదేశాలకు ఏ విధంగా ఎగుమతి చేసి రైతులకు లాభాలు తెచ్చామో, మిగిలిన పంటలను కూడా మార్కెటింగ్ చేసి రైతులకు లాభాలు తెచ్చే చర్యలు తీసుకుంటాం. 

  • పాడి, పట్టు, ఆక్వా రంగాలను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తాం. ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా పంటలను విదేశాలు, ఇతర రాష్ట్రాలకు మార్కెటింగ్ చేస్తాం.  వ్యవసాయాన్ని లాభాల బాటలో నడిపిస్తాం. వ్యవసాయం, అనుబంధ రంగాలను మేం అధికంగా ప్రోత్సహించి యువతను వ్యవసాయరంగం వైపు ఆకర్షిస్తాం. 
  • ఆర్బీకే కేంద్రాలు అలంకార కేంద్రాలుగా ఉన్నాయి. అవి ఎప్పుడు చూసినా తాళాలు వేసే ఉంటున్నాయి. మద్యం దుకాణాలు మాత్రం నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతోంది. గతంలో రైతులకు ఇచ్చిన విధంగానే సబ్సిడీపై డ్రిప్ ఇస్తాం. 
  • రైతులను ఆదుకోవడం, వారి ముఖంలో చిరునవ్వు చూడడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. గతంలో రైతులకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, సబ్సిడీ పథకాలు అన్నీ కొనసాగిస్తాం.  
  • అందరూ మెచ్చేలా పాలన అందిస్తాం... వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి. 

More Telugu News