Mosquito Coil: మస్కిటో కాయిల్.. ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలు తీసింది!

  • రాత్రి సమయంలో పరుపుపై పడిన మస్కిటో కాయిల్
  • కార్బన్ మోనాక్సైడ్ వెలువడటంతో ఊపిరాడక నిద్రలోనే ఆరుగురు మృతి
  • మరో ఇద్దరికి కాలిన గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స తర్వాత డిశ్చార్జ్
  • ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఘటన
Mosquito Coil Sets Off Fire In Delhi House 6 Killed

దోమలు రాకుండా పెట్టిన మస్కిటో కాయిల్ వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిందీ ఘటన. శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఈ రోజు ఉదయం వాళ్లు ఎవరూ బయటకు రాలేదు.. దీనికితోడు ఇంట్లో నుంచి పొగ వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అందరూ స్పృహ లేని స్థితిలో ఉన్నారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కాలిన గాయలైన మరో ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందించారు. తర్వాత వారిని డిశ్చార్జ్ చేశారు. 

‘‘రాత్రి సమయంలో తలుపులు, కిటికీలు అన్ని మూసివేసి.. మస్కిటో కాయిల్స్ వెలిగించారు. పరుపుపై మస్కిటో కాయిల్ పడటంతో మంటలు చెలరేగాయి. మస్కిటో కాయిల్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వెలువడింది. ఈ విషపూరిత పొగతో కుటుంబంలోని వారంతా స్పృహ కోల్పోయారు. తర్వాత వారు ఊపిరాడక మరణించారు’’ అని సీనియర్ ఆఫీసర్ జోయ్ టిర్కే చెప్పారు.

మృతుల్లో నలుగురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారని వివరించారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. గాలి లోనికి వచ్చేందుకు, పొగ బయటికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియలేదని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఆరుగురి మరణం వెనక ఎలాంటి కుట్రలు లేవని, హత్యలు కాదని వెల్లడించారు.

More Telugu News