Indore accident: అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడీ ముప్పు తప్పేది! ఇండోర్ మెట్లబావి ప్రమాదంపై స్థానికులు

  • పార్క్ స్థలం ఆక్రమించి గుడి కట్టారని గతేడాదే ఫిర్యాదు చేశామని వెల్లడి
  • తొలుత వాటర్ ట్యాంక్ నిర్మాణం.. ఆపై మెట్లబావిపై స్లాబ్ వేసి ఆలయం కట్టారని ఆరోపణ
  • బాలేశ్వర్ గుడి ప్రమాదంలో 35కు పెరిగిన మృతుల సంఖ్య 
Indore Tragedy Could Have Been Averted Locals Had Complained Last Year

ఇండోర్ లోని బాలేశ్వర్ గుడి ప్రమాదంలో మృతుల సంఖ్య 35 కు పెరిగింది. టెంపుల్ లో గురువారం జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకావడం, పదుల సంఖ్యలో జనం కూర్చోవడంతో మెట్లబావి పైకప్పు కూలిపోయింది. దీంతో చాలామంది భక్తులు బావిలో పడిపోయారు. తొలుత 13 మంది భక్తులు చనిపోయారని అధికారులు వెల్లడించారు. అయితే, శుక్రవారం ఉదయానికి మృతుల సంఖ్య 35 కు చేరింది.

బాలేశ్వర్ గుడి ప్రమాదంపై స్థానికులు స్పందిస్తూ.. గతేడాది తాము చేసిన ఫిర్యాదుపై అధికారులు సరిగ్గా స్పందించి ఉంటే ఇప్పుడీ ఘోర ప్రమాదం జరిగి ఉండేదే కాదని చెప్పారు. వాస్తవానికి బాలేశ్వర్ గుడి, పక్కనే కొత్తగా కడుతున్న మరో గుడి నిర్వహణ మొత్తం ప్రైవేటు ట్రస్టుల ఆధ్వర్యంలో జరుగుతోంది. పిల్లల పార్క్ ను ఆక్రమించి ఈ ఆలయాలను కట్టారని ఆరోపించారు. తొలుత వాటర్ ట్యాంక్ నిర్మించి స్థలాన్ని కబ్జా చేశారని, ఆపై మెట్లబావిపై స్లాబ్ వేసి బాలేశ్వర్ గుడి కట్టారని ఆరోపించారు.

దీనిపై తాము ఫిర్యాదు చేయడంతో 2022 ఏప్రిల్ లో బాలేశ్వర్ మహదేవ్ ఝులేలాల్ టెంపుల్ ట్రస్ట్ కు మున్సిపల్ కమిషనర్ నోటీసులు కూడా జారీ చేశారని చెప్పారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తమ ఫిర్యాదుపై అప్పుడే సరిగా స్పందించి చర్యలు తీసుకుంటే ఇప్పుడు 35 మంది ప్రాణాలు పోయేవి కాదన్నారు.

More Telugu News