Honda: హోండా నుంచి రెండు ఎలక్ట్రికల్ స్కూటర్లు

  • వచ్చే ఏడాదిలోపు విడుదల చేస్తామని ప్రకంటించిన కంపెనీ
  • స్వాపబుల్ బ్యాటరీతో తీసుకొస్తామని వెల్లడి
  • 2030 నాటికి ఏటా 10 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ లక్ష్యం
Honda to launch 2 electric two wheelers in India in FY24 with swappable battery

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సంస్థ ఇప్పటివరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి అడుగుపెట్టలేదు. పోటీ సంస్థలైన టీవీఎస్, బజాజ్ చేతక్, హీరో మోటోకార్ప్  ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. మారుతున్న వినియోగ ధోరణులకు అనుగుణంగా హోండా సైతం ఎలక్ట్రిక్ టూవీలర్లను తీసుకొచ్చే ప్రాజెక్టుపై పనిచేస్తోంది.

2023-24లో (అంటే వచ్చే ఏడాది కాలంలో) రెండు ఎలక్ట్రిక్ టూ వీలర్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రకటించింది. ఈ రెండూ స్వాపబుల్ బ్యాటరీతో వస్తాయని తెలిపింది. అంటే ఇంట్లో గంటల తరబడి రీచార్జ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీ చార్జింగ్ చివరికి వచ్చినప్పుడు సమీపంలోని కేంద్రం వద్దకు వెళ్లి రీచార్జ్ అయిన బ్యాటరీతో మార్చుకోవచ్చు. 

భారత్ లో తాము మధ్య శ్రేణి ఎలక్ట్రిక్ టూవీలర్లను తెస్తామని హోండా తెలిపింది. 2030 నాటికి ఏటా 10 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సామర్థ్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. కర్ణాటకలోని నరసపురలోని ప్లాంట్ లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనుంది. వీటిని దేశీ మార్కెట్ తోపాటు, విదేశీ మార్కెట్లకూ ఎగుమతి చేయనుంది. స్వాపబుల్ బ్యాటరీ తో స్కూటర్లను తెచ్చినప్పటికీ, వాటిని ఇంట్లో చార్జ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.

More Telugu News