Kangana Ranaut: కరణ్ జొహార్‌పై నటి కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు.. వరుస ట్వీట్లతో ఫైర్!

  • బాలీవుడ్‌లో రాజకీయాలు తట్టుకోలేకే హాలీవుడ్‌కు వెళ్లిపోయానన్న ప్రియాంక చోప్రా
  • ప్రియాంక వ్యాఖ్యలపై రెండుగా విడిపోయిన బాలీవుడ్
  • ప్రియాంక వెళ్లిపోవడానికి కరణ్ జొహారే కారణమని ఫైర్
  • బాలీవుడ్‌లో కొందరు గ్యాంగులా మారి ప్రియాంకను వేధించారని ఆరోపణ
Kangana Ranaut Sensational comments on Karan Johar

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జొహార్‌పై ఫైర్‌బ్రాండ్ కంగన రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. షారూఖ్ ఖాన్‌తో తన స్నేహితురాలు ప్రియాంక చోప్రా సన్నిహితంగా ఉండడంతో తట్టుకోలేకపోయిన కరణ్ ఆమెను బ్యాన్ చేస్తూ మానసికంగా వేధించాడని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లు చేస్తూ కరణ్‌పై విరుచుకుపడ్డారు.

ప్రియాంక ఇటీవల అమెరికన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ బాలీవుడ్‌కు దూరం కావడంపై సంచలన ఆరోపణలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో రాజకీయాలు తట్టుకోలేకే తాను హాలీవుడ్‌కు వెళ్లిపోయినట్టు చెప్పారు. అంతేకాదు, బాలీవుడ్‌లో తాను ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు. ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ రెండుగా విడిపోయింది. వివేక్ అగ్నిహోత్రి, కంగన రనౌత్ వంటివారు ఆమెకు అండగా నిలిస్తే, మరికొందరు మాత్రం ప్రియాంకపై విమర్శలు గుప్పించారు. బాధితురాలినని చెప్పుకోవడం ద్వారా సానుభూతి పొందాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు.

ఈ నేపథ్యంలో కంగన తాజాగా వరుస ట్వీట్లు చేస్తూ దర్శక, నిర్మాత కరణ్ జొహార్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లో కొందరు గ్యాంగ్‌గా మారి ప్రియాంకను అవమానించి పరిశ్రమను విడిచిపెట్టేలా చేశారని అన్నారు. స్వయం కృషితో ఎదిగిన మహిళను భారత్ వదిలి వెళ్లేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షారూఖ్‌తో ప్రియాంక స్నేహం చేయడం కరణ్‌కు నచ్చలేదని, దీంతో వారిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఈ విషయంలో అప్పట్లో మీడియాలో కథనాలు కూడా వచ్చాయన్నారు. కరణ్ జొహార్ ఆమెను బ్యాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.

సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చే వారికి హాని కలిగించాలని ఎదురుచూసే మూవీ మాఫియాకు ప్రియాంక దొరికిందని, ఆమె దేశం విడిచి వెళ్లిపోయే వరకు వేధించారని కంగన ఆరోపించారు. సినీ పరిశ్రమ వాతావరణాన్ని, సంస్కృతిని నాశనం చేసినందుకు కరణ్ జొహార్ బాధ్యత వహించాలని అన్నారు. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ వంటివారు సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఇలాంటి పరిస్థితులు లేవని కంగన గుర్తు చేశారు.

More Telugu News