prasanna kumar reddy: చివరి రక్తపుబొట్టు దాకా జగన్ తోనే ఉంటా.. పార్టీ మారుతున్నారన్న వార్తలపై ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్

  • జగన్ తనను ఇంట్లో బిడ్డలా చూసుకుంటున్నారన్న ప్రసన్న కుమార్
  • కోవూరులో ఇంకొకరికి టికెట్ ఇచ్చినా దగ్గరుండి గెలిపిస్తానని వ్యాఖ్య 
  • చంద్రబాబు మైండ్ గేమ్‌లో భాగంగానే తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపణ
ysrcp mla nallapureddy prasanna kumar reddy fires on fake news

తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలపై వైసీపీ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. యూట్యూబ్ లో వార్తలు పెట్టిన వారిపై నిప్పులుచెరిగారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్‌లో భాగంగానే తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. తన చివరి రక్తపుబొట్టు దాకా జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు.

తాను ఎవరినీ సంప్రదించలేదని ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల్లో గందళగోళం సృష్టించడానికి గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. తనకు రాజశేఖర్ రెడ్డి కుటుంబం మీద ప్రత్యేక గౌరవని.. జగన్ తనను చాలా బాగా చూస్తారని అన్నారు. జగన్‌తోనే తన పయనమని, తాను చనిపోయినా తన కొడుకు రజత్ కుమార్ రెడ్డి.. జగన్ వెంటే ఉంటారని తెలిపారు.

తనపై నిన్న వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పారు. ‘‘చాలా బాధపెట్టారు. రాత్రి నిద్రపోలేదు. ఎంతో మంది ఫోన్లు చేశారు. ప్రతి జిల్లా నుంచి కాల్స్ వచ్చాయి. ‘ఏందన్నా ఇది?’ అని అడిగారు. ‘ఫేక్ న్యూస్, నమ్మకండి’ అని చెప్పాను. తెల్లవార్లు అందరికీ ఇలానే చేబుతూ ఉన్నా. ఇలాంటి వార్తలు రాయొచ్చా?’’ అని ప్రశ్నించారు. 

‘‘ఎవరో ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుని చంద్రబాబు దగ్గరికి వెళ్లిపోయారు. కానీ జగన్ నాకేం తక్కువ చేశారు. ఒక ఇంట్లో బిడ్డలా నన్ను చూసుకుంటున్నాడు. నా నియోజకవర్గానికి ఏం అడిగితే అది ఇచ్చారు’’ అని చెప్పారు. 

‘‘బిల్లులు రాలేదని నేను వెళ్లిపోతున్నానా? ఏమైనా అర్థం ఉందా? నేనేంది? జగన్ ను వదిలేదేంది? ఆ వార్త పెట్టేటప్పుడు కొంచమైనా బుద్ధి ఉండొద్దా? సిగ్గు ఉండొద్దా? మీ అమ్మా అబ్బలకు పుట్టారా? ఎలా రాస్తారు నా గురించి? నేను చెప్పానా? నన్ను అడిగారా? అవసరమా?’’ అని మండిపడ్డారు.

‘నువ్వు వద్దు పక్కకు జరుగు. ఇంకొకరికి కొవ్వూరులో టికెట్ ఇస్తా’ అని జగన్ చెప్పినా సంతోషంగా స్వాగతిస్తానని, దగ్గరుండి గెలిపిస్తానని అన్నారు. జగన్ ను తాను వదిలే ప్రసక్తే లేదని, ఇలాంటి వార్తలు మానుకోవాలని హితవు పలికారు.

More Telugu News