EPFO: ఈపీఎఫ్ఓ భారీ నోటిఫికేషన్.. మొత్తం 2,674 ఉద్యోగాల భర్తీ

  • ఏపీ, తెలంగాణలో మొత్తం 155 పోస్టులు
  • ఏదైనా డిగ్రీతో పాటు టైపింగ్ సర్టిఫికెట్ తప్పనిసరి 
  • ఈ నెల 27 నుంచి దరఖాస్తుకు అవకాశం
EPFO job notification to fillup 2674 posts

ఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న 2,674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎస్‌ఎస్‌ఏ- గ్రూప్ సీ) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 155 (ఏపీ-39, తెలంగాణ-116) పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టే ఈ నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు..
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని ఈపీఎఫ్ఓ పేర్కొంది. అభ్యర్థులకు టైపింగ్ తెలిసి ఉండాలని, నిమిషానికి ఇంగ్లిష్ లో 35 పదాలు లేదా నిమిషానికి 30 హిందీ పదాలు టైప్‌ చేయగలగాలని వివరించింది. వయోపరిమితి విషయానికి వస్తే.. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందని తెలిపింది.

దరఖాస్తు విధానం..
ఆన్ లైన్ లో ఈ నెల 27 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.700 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. 

చివరితేదీ: ఏప్రిల్‌ 26, 2023

ఎంపిక విధానం..
ఆన్‌లైన్‌ రాతపరీక్ష, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

More Telugu News