Delhi Capitals: డబ్ల్యూపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్

  • చివరి లీగ్ మ్యాచ్ లో యూపీ వారియర్స్ విజయం
  • పాయింట్ల పట్టికలో ఢిల్లీకి అగ్రస్థానం
  • నేరుగా ఫైనల్ బెర్తు ఖరారు
  • మరో ఫైనల్ బెర్తు కోసం ఎలిమినేటర్ మ్యాచ్
  • ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడనున్న ముంబయి, యూపీ
Delhi Capitals rams into WPL final

భారత్ లో ఈ ఏడాది తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్లో ప్రవేశించింది. చివరి లీగ్ మ్యాచ్ లో యూపీ వారియర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసింది. తహ్లియా మెక్ గ్రాత్ 58 పరుగులతో అజేయంగా నిలిచింది. కెప్టెన్ అలీసా హీలీ 36, శ్వేతా సెహ్రావత్ 19 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఆలిస్ కాప్సే 3, రాధా యాదవ్ 2, జొనాసెన్ 1 వికెట్ తీశారు. 

అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 39, ఆలిస్ కాప్సే 34, మరిజేన్ కాప్ 34 (నాటౌట్), షెఫాలీ వర్మ 21 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు పోటీపడగా, ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్ ల్లో 6 విజయాలు, 2 ఓటములతో మొత్తం 12 పాయింట్లు సాధించి నెంబర్ వన్ గా నిలిచింది. రెండో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్ కూడా 8 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించినా, రన్ రేట్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ పొజిషన్ లో నిలిచింది. 

ఇక, మార్చి 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి, యూపీ వారియర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ మార్చి 26న ముంబయి బ్రాబోర్న్ స్టేడియంలో జరగనుంది.

More Telugu News