Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లో దొంగలు పడ్డారు

  • బీరువాలో దాచిన 12 ట్యాబ్ లను ఎత్తుకెళ్లిన దుండగులు
  • పశ్చిమ గోదావరి జిల్లాలోని రాయకుదురు జెడ్పీ హైస్కూల్లో చోరీ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రధానోపాధ్యాయుడు
Robbery in govt high school in andhrapradesh

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దొంగతనం జరగడం కలకలం రేపుతోంది. రాత్రిపూట పాఠశాలలోకి చొరబడ్డ దొంగలు.. 12 ట్యాబ్ లను ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ చోరీ విషయం సోమవారం ఉదయం స్కూలుకు వచ్చిన ఉపాధ్యాయులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పాఠశాల ఇన్ చార్జి, ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.

జిల్లాలోని వీరవాసరం మండలం రాయకుదురు జడ్పీ హైస్కూల్లో ఈ చోరీ జరిగింది. రాత్రిపూట స్కూల్ లోకి చొరబడ్డ దుండగులు ఉపాధ్యాయుల గదిలోని బీరువాలో భద్రపరిచిన ట్యాబ్ లను ఎత్తుకెళ్లారు. ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు ఏఎస్సై ధర్మారావు కేసు నమోదు చేశారు. భీమవరం రూరల్ సీఐ సీహెచ్ నాగప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం.. వేలిముద్రలతో పాటు పలు ఆధారాలు సేకరించారు. ఈ దొంగతనానికి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ నాగప్రసాద్ తెలిపారు.

More Telugu News