Revanth Reddy: కేసీఆర్ రాక్షస పాలనకు ఓ నిరుద్యోగి బలయ్యాడు: రేవంత్ రెడ్డి

  • టీఎస్ పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీక్
  • మనస్తాపంతో నవీన్ కుమార్ ఆత్మహత్య
  • గ్రూప్-1కి ప్రిపేర్ అవుతున్న సిరిసిల్ల యువకుడు
  • కేసీఆర్ పై హత్యా నేరం కింద కేసు పెట్టాలన్న రేవంత్ రెడ్డి
Revanth Reddy fires in CM KCR over Sirisilla youth committed suicide

అనేక ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమై, ఇటీవల టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో మనస్తాపం చెందిన సిరిసిల్ల యువకుడు నవీన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

కేసీఆర్ రాక్షస పాలనకు ఓ నిరుద్యోగి బలయ్యాడని పేర్కొన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్-1కి సన్నద్ధమైన సిరిసిల్లకు చెందిన నవీన్ కుమార్ తాజా లీకేజి పరిణామాలతో మనస్తాపానికి గురై ఉరికొయ్యకు వేలాడాడని వివరించారు. కేసీఆర్ పై హత్యా నేరం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. 

నవీన్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, కాంగ్రెస్ అండగా ఉంటుందని, పోరాటం చేద్దామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

More Telugu News