Hyderabad: కుమార్తెపై లైంగికదాడికి పాల్పడిన తండ్రి.. కోర్టు సంచలన తీర్పు

  • తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్న కుటుంబం
  • కుమార్తె తీసుకునే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి అత్యాచారం
  • చెబితే చంపేస్తానని బెదిరింపు
  • మెట్రోలీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా బాలికకు రూ. 7 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశం
Nampally Court Sensational verdict

కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అతడు బతికి ఉన్నంత వరకు జైలులోనే ఉంచాలని ఆదేశించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఫిలింనగర్‌లో నివసిస్తోంది. కుటుంబ యజమాని సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, అతడి భార్య స్థానికంగా ఇళ్లలో పనిచేస్తోంది. వీరికి 14 ఏళ్ల కుమార్తె, కుమారుడు ఉన్నారు. అబ్బాయి తూర్పుగోదావరి జిల్లాలోనే ఓ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. కుమార్తె మాత్రం తల్లిదండ్రులతోనే ఉంటోంది.

జులై 2021లో కుమార్తె అనారోగ్యం బారినపడి వాంతులు చేసుకోవడంతో తల్లి ఆమెను ఆసుపత్రిలో చూపించింది. పరీక్షించిన వైద్యులు ఆమె నాలుగు నెలల గర్భణి అని చెప్పడంతో ఆ తల్లి గుండె ఆగినంత పనైంది. ఆరా తీయడంతో అసలు విషయం తెలిసి భోరున విలపించింది. భార్య పనికి వెళ్లిన తర్వాత కుమార్తె తీసుకునే భోజనంలో తండ్రి నిద్ర మాత్రలు కలిపేవాడు. భోజనం చేసిన తర్వాత ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారానికి పాల్పడేవాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. విషయం వెలుగులోకి రావడంతో నిందితుడు పరారయ్యాడు. 

భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసును విచారించిన నాంపల్లిలోని 12వ అదనపు ఎంఎస్‌జే కోర్టు తుదితీర్పు వెలవరించింది. నిందితుడు మరణించే వరకు జైలులోనే ఉంచడంతోపాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే, మెట్రోలీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా బాధిత బాలికకు రూ. 7 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News