Chandrababu: నేను క్లాస్ రూంలో కంటే సైకిల్ స్టాండ్ వద్దనే ఎక్కువగా ఉండేవాడ్ని: చంద్రబాబు

  • సీబీఎన్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు
  • నిరుద్యోగులు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లతో ముఖాముఖి
  • వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన చంద్రబాబు
Chandrababu attends CBN Connect

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీబీఎన్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 

ప్రశ్న:- రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న నేత మీరు. నేటి పాలనపై ఏమంటారు?
చంద్రబాబు: టెక్నాలజీ కారణంగా ప్రపంచం చాలా మారిపోయింది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయా ప్రభుత్వాలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేసాయి. నేను ఎన్టీఆర్ వద్ద పని చేశాను. సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేశాను. అయితే ఇంత దారుణమైన పాలన...ఇంత దారుణమైన సిఎంను ఎప్పుడూ చూడలేదు. 
 
ప్రశ్న:-100 ఏళ్ల స్వాతంత్య్రం నాటికి భారతదేశం ఎలా ఉంటుంది? మీ ఆలోచనలు, సూచనలు ఏంటి?
చంద్రబాబు: వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో టెలికాం రంగంలో సంస్కరణలు తీసుకువచ్చాం. జాతీయ రహదారుల అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రణాళికలు అమలుచేశాం. స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం ద్వారా రోడ్ల నిర్మాణం చేపట్టాం. ఇదే సమయంలో టెక్నాలజీ రంగంలో, ఫార్మా రంగంలో వచ్చిన మార్పులను గమనించి నాడు ప్రోత్సహించాం. మన దేశానికి ఉన్న బలం యువత. మనకు ఉన్న ఆయుధం ఐటీ. యువశక్తిని మరింత బాగా ప్రోత్సహించడం ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించవచ్చు.
  
ప్రశ్న:-ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వ పరంగా మీరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేయగలరా?
చంద్రబాబు: పిల్లల జీవితాలు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. నాకు చిన్నప్పుడు మా టీచర్ల ప్రోత్సాహం ఉండేది. అయితే గతంలో టీచర్ల బదిలీల కోసం రాజకీయ నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగే విధానం అమలులో ఉండేది. దీనికి స్వస్తి పలికి ఉమ్మడి ఏపీలో నిర్ణయాలు తీసుకున్నాను. ఆన్ లైన్ విధానంలో టీచర్ల బదిలీల ప్రక్రియ చేపట్టాను. జీతాల విషయంలో న్యాయం చేశాను. అయితే ఇప్పుడు టీచర్లను బ్రాందీ షాపుల వద్ద పెడుతున్నారు. చాలా విధాలుగా ప్రభుత్వం టీచర్లను అవమానిస్తోంది. 

కరోనా సమయంలో ప్రైవేటు టీచర్ల జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ప్రభుత్వ టీచర్లతో పాటు ప్రైవేటు రంగ టీచర్లు, విద్యా సంస్థలు చాలా కీలకం. అందుకే నేను ప్రైవేటు విద్యా సంస్థలను కూడా ప్రోత్సహించాను. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. పొరపాటున వైసీపీని గెలిపిస్తే మరింత తీవ్రంగా నష్టపోతారు. ప్రైవేటు టీచర్ల కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం. 

ప్రశ్న:-పేదలకు న్యాయం అందడంలో చాలా జాప్యం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థను అవహేళన చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ విషయంలో మీ ఆలోచనలు ఏంటి?

చంద్రబాబు: ప్రజాస్వామ్యంలో చట్టసభలు, అధికార వ్యవస్థ, మీడియా వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ ఉన్నాయి. నేరస్థుడైన వ్యక్తి సీఎంగా ఉన్నప్పుడు సమాజంలో చాలా సమస్యలు వస్తాయి. సుప్రీంకోర్టు డైరెక్షన్ ను రాష్ట్రంలో ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా ప్రభుత్వం హరిస్తోంది. ఈ ప్రభుత్వం వేల కొద్దీ కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటుంది.

ప్రజాస్వామ్యయుతంగా పనిచేసే ప్రభుత్వం వస్తే సమస్యలు తొలగిపోతాయి. న్యాయవాదులకు ఆర్థిక భద్రత, ఇంటి స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తరహా ప్రణాళికలు అమలు చేస్తాం. జగన్ సొంత కేసులు వాదించిన న్యాయవాదులకు ఇప్పుడు కోట్లు చెల్లించి ప్రభుత్వ కేసులు అప్పగిస్తున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటున్నామంటే దానికి కారణం న్యాయవ్యవస్థ అని నేను నమ్ముతున్నాను.

ప్రశ్న:-మీ కాలేజ్ డేస్ లో మీకు బాగా గుర్తున్న విషయాలు ఏంటి?
చంద్రబాబు: నేను క్లాస్ రూం కంటే సైకిల్ స్టాండ్ వద్దనే ఎక్కువగా ఉండేవాడిని. గొడవలు, అల్లరి ఉండేది. నాడు విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. విద్యార్థిగా ఉన్న నన్ను రాజకీయాల్లో గెలిపించారు. నా ప్రచారం యూనివర్సిటీ నుంచే మొదలు పెట్టేవాడిని. ఆ మంచి రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి.

ప్రశ్న:-పేదలకు తక్కువ ఖర్చుతో  వైద్య సహాయం అందేలా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు?

చంద్రబాబు: వైద్య రంగంలో పెను మార్పులు వచ్చాయి. నాడు గుండె ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లారు. ఇప్పుడు అక్కడి కంటే ఎక్కువ వసతులు మన దగ్గర ఉన్నాయి. నాడు హైదరాబాద్ లో నిమ్స్ ను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన జినోమ్ వ్యాలీ ఏర్పాటు అయ్యింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. 

2014 తర్వాత వైద్య పరంగా అనేక పథకాలు తీసుకువచ్చాం. పిల్లలకు, స్త్రీలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాం. రోగాల బారిన పడుతున్నారు. నాడు హ్యాపీ సండే అని, మారథాన్ లు అని పెట్టాం. ఇవన్నీ ఆరోగ్య రక్షణ కోసమే పెట్టాం. మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆరోగ్యానికి మరింత ప్రాధాన్యం ఇస్తాం.
ప్రశ్న:-రాష్ట్రంలో లాయర్ వృత్తి చేపట్టే వారి సంఖ్య తగ్గుతుంది. దీనిపై మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ప్రణాళికలు చేస్తారు?
చంద్రబాబు: లాయర్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే సమాజానికి మంచిది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లిటిగేషన్ లు, సమస్యలు పెరిగిపోయాయి. నాడు హైదరాబాద్ లో నల్సార్ యూనివర్సిటీ తీసుకువచ్చాం. ఇప్పుడు అది దేశంలో అత్యుత్తమ సంస్థగా ఉంది. లాయర్ల సంక్షేమం కోసం కూడా అధికారంలోకి వచ్చిన తరువాత దృష్టిపెడతాం.

ప్రశ్న:-మీరు విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చారు. నాడు విద్యార్థిగా ఉన్న మీకు లా చదవాలి అని ఎప్పుడూ అనిపించలేదా? ప్రభుత్వం అడ్వకేట్లకు ఇచ్చే సాయం అరకొరగా ఉంది. మీరు వచ్చాక ఏం చేస్తారు?
చంద్రబాబు: ఇలాంటి ప్రభుత్వం వస్తుంది అనుకుని ఉంటే నేను అప్పట్లో లా చేసేవాడిని. ఇదొక విధ్వంసకర ప్రభుత్వం. నేను పోలీసు వ్యవస్థను ప్రజల రక్షణ కోసం పనిచేయించాను. కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థను ప్రజలను ఇబ్బంది పెట్టడానికి, వేధించడానికి ఉపయోగిస్తున్నారు. నేను ఎంఏ ఎకనమిక్స్ చేశాను. అందుకేనేమో సంపద సృష్టిలో నేను ముందు ఉన్నాను అనుకుంటున్నాను. నాకున్న అనుభవంతో పేదరికం లేని సమాజం కోసం పనిచేస్తాం. దానికి మీ అందరి సహకారం కావాలి. 

ప్రశ్న:- ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా బోగస్ ఓట్లు వచ్చాయి. సాధారణ ఎన్నికల్లో మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓట్లను కొంటున్నారు. దీన్ని ఎలా చూడాలి?
చంద్రబాబు: ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు వచ్చాయి. దీంతో అనేక బోగస్ ఓట్లు చేర్చారు. తిరుపతిలో వైసీపీ కార్యాలయ అడ్రస్ తో 36 ఓట్లు సృష్టించారు. డిగ్రీ లేని వారిని కూడా పట్టభద్ర ఓటర్లుగా చేర్చారు. ఇలా 30 శాతం దొంగ ఓట్లు చేర్చారు. ఇలాంటి వారిని ఏమనాలి? అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ప్రశ్నించినా లెక్కపెట్టడం లేదు.

రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి. ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పకపోతే అడ్డు అదుపు ఉండదు. వైసీపీకి ఎవరూ ఓటు వేయవద్దు. పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసుకున్న తరువాత రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ అభ్యర్ధులకు వేయాలి అని కోరుతున్నా. ఇదే సమయంలో పీడీఎఫ్ కు ఓటు వేసిన వారు, తమ రెండవ ప్రాధాన్య ఓటు టీడీపీకి వేయాలి అని కోరుతున్నా.  
ప్రశ్న:- రాష్ట్రంలో పెట్టుబడులు లేక...నిరుద్యోగం పెరిగిపోయింది? దీనికి పరిష్కారం ఏంటి?
చంద్రబాబు: నాడు అనంతపురానికి కియా మోటార్స్ తీసుకువచ్చాం. దీంతో అక్కడ అభివృద్ధి జరిగింది. ఇదే జిల్లాకు సాగునీరు ఇచ్చాం. దీంతో వ్యవసాయం పెరిగి భూమి విలువ పెరిగింది. అయితే నేడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పరిశ్రమలు, కొత్త పెట్టుబడులు  రాకపోగా, ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. రాష్ట్రాన్ని సెటిల్మెంట్ రాష్ట్రంగా మార్చారు. దశాబ్దాల పాటు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని మెడపై కత్తి పెట్టి రాయించుకుంటున్నారు. పోర్టులు, భూములు, ఆస్తులు ఈ ప్రభుత్వ సెటిల్మెంట్లో పోతున్నాయి. 

అయితే చిన్న లోటు ఉంది. సమాజంలో కులంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల నష్టపోతున్నామా అనేది ఆలోచించుకోవాలి. తప్పుడు మాటలు నమ్మి మోసపోతున్నామా అని ఆలోచన చేయాలి. ప్రజల్లో చైతన్యంతో వీటిలో మార్పు తీసుకురావాలి. 

చివరిగా అందరికీ ఒక విన్నపం. రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలి. టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మద్య ఓట్ల బదిలీ జరగాలి. రెండో ప్రాధాన్య ఓటు పరస్పరం బదిలీ అవ్వాలి. ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దు అని ఓటర్లను కోరుతున్నాను. వైసీపీని ఓడించాలని కోరుతున్నాను.

More Telugu News