పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి... తొమ్మిది మంది పోలీసు అధికారుల మృతి

  • ధాదర్ పట్టణంలో ఘటన
  • బైక్ పై వచ్చి పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన సూసైడ్ బాంబర్
  • ఓ పశువుల ప్రదర్శన నుంచి తిరిగి వెళుతున్న పోలీసులు
పాకిస్థాన్ లో ఉగ్ర బీభత్సం చోటుచేసుకుంది. నైరుతి పాకిస్థాన్ లోని ధాదర్ పట్టణంలో ఆత్మాహుతి దాడి జరిగింది. బైక్ పై వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు పోలీసు వాహనాన్ని వెనుకనుంచి బలంగా ఢీకొట్టాడు. దాంతో భారీ విస్ఫోటనం సంభవించగా, 9 మంది పోలీసు అధికారులు దుర్మరణం పాలయ్యారు. 16 మందికి గాయాలయ్యాయి. 

పేలుడు ధాటికి పోలీసు వాహనం తలకిందులైంది. ఓ పశువుల ప్రదర్శనకు బందోబస్తు నిర్వహించి తిరిగి వస్తున్న పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్టు కచ్చి జిల్లా ఎస్పీ మహ్మద్ నోతేజాయ్ వెల్లడించారు. 

కాగా ఈ దాడికి తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు. అయితే గతంలో ఇలాంటి ఘటనలు జరగ్గా, అవి బలూచిస్థాన్ వేర్పాటువాదులు, స్థానిక మిలిటెంట్ల పనే అని ఆరోపణలు వచ్చాయి. ఈ దాడి కూడా వారే చేసి ఉంటారని భావిస్తున్నారు.

Suicide Attack
Dhadar
Kachchi District
Police Officers
Pakistan

More Telugu News