Electric Scooter: కొత్త ఈ-బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిపోవచ్చు!

  • త్వరలో మార్కెట్లోకి రానున్న కొత్త ఈ-స్కూటర్
  • మైలేజీలో టాప్ హైదరాబాదీ బ్రాండ్ ‘బ్రిక్స్’ బైక్
  • ఫుల్ ఛార్జ్ చేస్తే 333 కిలోమీటర్ల దాకా ప్రయాణం
Indias Largest Range Electric Scooter with a Range of 333km from Brisk EV

పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. చిన్న చిన్న ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, బస్సులు, ట్రక్కుల వంటి భారీ వాహనాలకూ ఆదరణ పెరుగుతోంది. నిర్వహణ ఖర్చు తగ్గడంతో పాటు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుండడంతో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీల ఈ-స్కూటర్ లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ మైలేజీ విషయంలో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తున్న సరికొత్త ఈ-స్కూటర్ బ్రిస్క్.. మైలేజీలో ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఈ-స్కూటర్ లను ఇది వెనక్కి నెట్టేస్తుందట. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే ఏకంగా 333 కిలోమీటర్లు దీనిపై ప్రయాణించవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. స్కూటర్ తో హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ప్రయాణించవచ్చు. హైదరాబాదీ బ్రాండ్ తో తయారవుతున్న ఈ-స్కూటర్ మార్కెట్లోకి రావడానికి ఇంకొంత సమయం పడుతుందట.

హైదరాబాద్ లో జరిగిన ఈ- మోటార్ షోలో కంపెనీ దీనిని వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రదర్శించింది. ప్రస్తుతం ఆరిజిన్, ఆరిజిన్ ప్రో పేర్లతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది.

ఆరిజిన్ ప్రో మోడల్ విశేషాలు..
బయలుదేరిన 3.3 సెకన్ల వ్యవధిలోనే గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టాప్ స్పీడ్ 85 కిలోమీటర్లు. ఇందులో 4.8 కేడబ్ల్యూహెచ్ ఫిక్స్డ్ బ్యాటరీ, 2.1 కేడబ్ల్యూహెచ్ స్వాపబుల్ బ్యాటరీని అమర్చింది. ఈ స్కూటర్‌లోని మోటార్ కెపాసిటీ 5.5 కేడబ్ల్యూగా ఉంది. ఓటీఏ బ్లూటూత్, మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. దీని ధర రూ. 1.2 లక్షల నుంచి రూ. 1.4 లక్షల దాకా ఉండొచ్చని అంచనా.

ఆరిజిన్ ఎలక్ట్రిక్
ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 175 కిలోమీటర్లు ఆగకుండా పరుగులు పెడుతుంది. స్టార్ట్ చేసిన కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మి వేగం అందుకుంటుంది. దీని ధర రూ.70 వేల నుంచి రూ.80 వేల దాకా ఉండొచ్చని అంచానా. టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. ఇందులో కూడా ఓటీఏ బ్లూటూత్, మొబైల్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. 2023 అక్టోబర్ లో ఈ స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

More Telugu News