Chandrababu: గూగుల్ టేక్ ఔట్ లాంటి టెక్నాలజీ వస్తుందని, దానికి తాను తగులుకుంటానని జగన్ ఊహించి ఉండడు: చంద్రబాబు

  • టీడీపీలో చేరిన కన్నా
  • రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్న చంద్రబాబు
  • కొందరు పోలీసులు జగన్ కు పావులుగా మారారని విమర్శలు
  • ఒక నరహంతకుడికి ఓటేశామని వ్యాఖ్యలు
Chandrababu comments on Jagan

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్, వైసీపీ, పోలీసులపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కొందరు పోలీసులు జగన్ కు పావులుగా మారారని ఆరోపించారు. జగన్ చెప్పినట్టు పోలీసు వ్యవస్థ నడుచుకుంటోందని, పోలీసులు తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. 

ఎటుపోతోంది ఈ రాష్ట్రం? రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఐపీసీ చట్టం లేదు.. వైసీపీ చట్టం ఉంది అని విమర్శించారు. రాష్ట్రంపై బాధ్యత తనకు, కన్నా లక్ష్మీనారాయణకు మాత్రమే లేదని... ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  

ఈ సందర్భంగా వివేకా అంశాన్ని కూడా ప్రస్తావించారు. అధికారానికి అడ్డం వచ్చినందుకే హత్య చేశారని, షర్మిలకు ఎంపీ సీటు కోసం పట్టుబట్టినందుకే అడ్డుతొలగించుకున్నారని ఆరోపించారు. హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అని అఫిడవిట్ లో స్పష్టంగా చెప్పారని ఎద్దేవా చేశారు. కోడికత్తి కమల్ హాసన్ ఎంత డ్రామాలు ఆడాడు... ఓ సినిమా తీయాలన్నా అసలు ఇలాంటి స్టోరీని ఎవరూ ఊహించలేరని ఎద్దేవా చేశారు. 

"బాబాయ్ ని చంపిన విధానం, ఆడిన నాటకం కూడా ఎవరూ ఊహించలేరు. వీళ్లందరూ ఆ రోజున అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని సీబీఐ చెబుతోంది. వీళ్లందరూ అక్కడే ఉండి దస్తగిరి తదితరులతో గొడ్డలి తెప్పించారట. అక్కడ్నించి వెళ్లి హత్య చేసి మళ్లీ ఈ ఇంటికే వచ్చారట. ఆ తర్వాత అసలు నాటకానికి తెరలేపారు. గుండెపోటుతో రెండు లీటర్ల రక్తం కక్కుకుని బాత్రూంలోకి వెళ్లి పడిపోయాడట. వాళ్లు చెప్పింది మీరు నమ్మి ఓట్లేసి గెలిపించారు. ఒక నరహంతకుడికి ఓటేశాం. మెజారిటీ ప్రజలు ఓటేస్తేనే వారికి 151 సీట్లు వచ్చాయి. 

వివేకా హత్య జరిగిన తర్వాత నారాసుర రక్తచరిత్ర అని పేపర్లో వేసుకున్నారు. సీబీఐ విచారణ కావాలని అడిగాడు. తప్పు చేసిందే కాక, దాన్ని ఇతరులపైకి నెట్టడం చూస్తుంటే ఎంత కంపరంగా ఉంటుంది? కానీ గూగుల్ టేక్ ఔట్ లాంటి టెక్నాలజీ వస్తుందని, దానికి తాను తగులుకుంటానని జగన్ ఊహించి ఉండడు. గూగుల్ అంకుల్ ని అడిగితే చాలు... అన్ని వివరాలను మన ముందుంచుతుంది" అని ఎద్దేవా చేశారు. 

"అందుకే నేను అంటూ ఉంటాను... ఎవడేం చేసిందీ గూగుల్ అంకుల్ ని అడిగితే సరిపోతుందని చెబుతుంటాను. ఇప్పుడా గూగుల్ టేక్ ఔట్ స్పష్టంగా వివరించింది. కుట్రదారులు ఉన్నది, కుట్ర చేసిన తర్వాత మళ్లీ వాళ్లు వచ్చింది అవినాశ్ రెడ్డి ఇంటికేనని, అక్కడ్నించి లోటస్ పాండ్ కి ఫోన్లు వెళ్లాయని మొత్తం వివరాలన్నీ బయటికి వచ్చేశాయి" అని చంద్రబాబు వివరించారు.

More Telugu News