26/11 Attackers: పాకిస్థాన్ వెళ్లి.. పాకిస్థాన్ పైనే విమర్శలు.. జావేద్ అక్తర్ మాటల తూటాలు.. వీడియో ఇదిగో!

  • ఇటీవల పాకిస్థాన్ లోని లాహోర్ లో పర్యటించిన జావేద్ అక్తర్
  • 26/11 ఉగ్ర దాడులు చేసిన వాళ్లు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శ
  • దీనిపై హిందుస్థానీల హృదయాల్లో కోపం ఉంటుందని వ్యాఖ్య
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
MUMBAI Attackers Still Roaming FreeIn Pakistan Says Javed Akhtar in Pakistan

ప్రముఖ సినీ రచయిత, కవి జావేద్ అక్తర్.. పాకిస్థాన్ కు వెళ్లి పాకిస్థాన్ పైనే విమర్శలు చేశారు. ముంబై 26/11 ఉగ్ర దాడులు చేసిన వాళ్లు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సహా ఎంతో మంది ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

ఉర్దూ కవి ఫియాజ్ అహ్మద్ ఫియాద్ స్మారక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల పాకిస్థాన్ లోని లాహోర్ కు జావేద్ అక్తర్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఇంటరాక్షన్ లో పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు.

‘‘మీరు ఎన్నోసార్లు పాకిస్థాన్ కు వచ్చారు. మీరు తిరిగి వెళ్లినప్పుడు.. ‘అక్కడి ప్రజలు మంచివాళ్లు.. బాంబులు వేయడమే కాకుండా దండలు కూడా వేసి ప్రేమగా పలకరిస్తారు’ అని చెబుతారా?’’ అంటూ ప్రేక్షకుల్లో ఒకరు అడిగారు. స్పందించిన అక్తర్.. ‘‘మనం ఒకరినొకరు నిందించుకోకూడదు. అది దేన్నీ పరిష్కరించదు. వాతావరణం ఉద్రిక్తంగా ఉంది.. దాన్ని చల్లబరచాల్సి ఉంది. మేం ముంబై వాసులం. మా సిటీపై ఉగ్రదాడి జరిగింది. వాళ్లు (దాడి చేసిన వాళ్లు) నార్వే నుంచో, ఈజిప్టు నుంచో రాలేదు. మీ (పాకిస్థాన్) దేశంలో ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. హిందుస్థానీల హృదయాల్లో కోపం ఉంటుంది. దానిపై మీరు ఫిర్యాదు చేయలేరు’’ అంటూ ఘాటుగా బదులిచ్చారు. 

భారతదేశం నుంచి వచ్చే కళాకారులను పాకిస్థాన్ లో కనీసం సరిగ్గా ఆహ్వానించడం లేదని జావేద్ అక్తర్ అన్నారు. ‘‘ఫియాజ్ సాహెబ్ ఇండియాకు వచ్చినప్పుడు.. ఎంతో ముఖ్యమైన అతిథి వచ్చారని ఆహ్వానించాం. అన్ని చోట్లా అది ప్రసారమైంది. నుస్రత్ ఫతే అలీ ఖాన్, మెహ్దీ హాసన్ ల పెద్ద కార్యక్రమాలను మేం నిర్వహించాం. కానీ మీరు లతా మంగేష్కర్ కోసం ఒక్క కార్యక్రమం కూడా ఏర్పాటు చేయలేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ చప్పట్లు కొట్టారు.

పాకిస్థాన్ పై జావేద్ అక్తర్ సర్జికల్ స్ట్రయిక్స్ చేశారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వీడియోను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ‘ఇంట్లోకి దూరి మరీ దాడి చేశారు’ అంటూ పొగుడుతున్నారు. ‘‘నేను జావేద్ సాబ్ కవిత్వం వింటున్నప్పుడు.. ‘ఆయన సరస్వతీ దేవి ద్వారా ఎంత ఆశీర్వాదం పొందారో కదా!’ అని ఆశ్చర్యపోతుంటాను. దేవుడు ఆశీర్వదించాలంటే వారిలో ఏదో స్వచ్ఛత ఉండాలి. జై హింద్. జావేద్ సాబ్.. ఘర్ మే ఘుస్ కే మారా (మీరు వారి ఇంట్లోకి దూరి కొట్టారు)" అంటూ కంగనా రనౌత్ ట్వీట్ చేశారు.

More Telugu News