Ranga Reddy District: మరో ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య

  • మూడోసారీ ఆడపిల్లే పుట్టిందని తండ్రి మనస్తాపం
  • ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య
  • రాజేంద్రనగర్‌లో వెలుగు చూసిన ఘటన
Father commits suicide after wife gives birth to another girl child

మూడోసారీ ఆడపిల్లే పుట్టిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. అత్తాపూర్ ఔట్‌పోస్ట్ ఎస్సై కిషన్‌జీ తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ అహ్మద్(35)కు ఇద్దరు ఆడపిల్లలు. అతడు ఓ ఫర్నీచర్‌ షాప్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

పదిహేను రోజుల క్రితం అహ్మద్ భార్య కాన్పు కోసం కర్ణాటకలోని తన పుట్టింటికి వెళ్లింది. మరోమారు ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో.. మనస్తాపానికి గురైన అహ్మద్ కొన్ని రోజులుగా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

More Telugu News