Team India: మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి

  • దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్
  • నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య లీగ్ మ్యాచ్
  • మొదట 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 రన్స్ చేసిన ఇంగ్లండ్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులే చేసిన భారత్
Team India lost to England in Womens T20 World Cup

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు ఓటమి ఎదురైంది. నేడు ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అమ్మాయిల జట్టు 11 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. అయితే లక్ష్యఛేదనలో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులే చేసింది. 

వికెట్ కీపర్ రిచా ఘోష్ పోరాడినా భారత్ ను గెలిపించలేకపోయింది. రిచా ఘోష్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఓపెనర్ స్మృతి మంధన 52 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో సారా గ్లెన్ 2, లారెన్ బెల్ 1, సోఫీ ఎకెల్ స్టోన్ 1 వికెట్ తీశారు. 

గ్రూప్ బి లో టీమిండియాకు ఇదే తొలి ఓటమి. ఇంతకుముందు జరిగిన లీగ్ మ్యాచ్ ల్లో టీమిండియా అమ్మాయిలు... పాకిస్థాన్, వెస్టిండీస్ పై నెగ్గారు. భారత్ తన తదుపరి లీగ్ మ్యాచ్ ను ఈ నెల 20న ఐర్లాండ్ తో ఆడనుంది. ఐర్లాండ్ పై నెగ్గితే భారత్ కు సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైనట్టే.

More Telugu News