ఏ పాదయాత్రకు ఇన్ని ఆంక్షలు చూడలేదు: సోమిరెడ్డి

  • లోకేశ్ పాదయాత్రకు అనేక ఆంక్షలు విధిస్తున్నారన్న సోమిరెడ్డి
  • జీవో నెంబర్ 1 పేరుతో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపాటు
  • ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సోమిరెడ్డి
రాష్ట్రంలో ఎన్నో పాదయాత్రలు జరిగాయని... కానీ తమ యువనేత నారా లోకేశ్ పాదయాత్రపై విధించినన్ని ఆంక్షలు ఇంత వరకు ఏ పాదయాత్రలో చూడలేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జీవో నెంబర్ 1 పేరుతో పాదయాత్రకు పోలీసులు అనేక అడ్డంకులను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులను సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజా మద్దతుతో పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.

 ఈ ఉదయం తిరుమల శ్రీవారిని సోమిరెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ, పేద, గిరిజన కుటుంబాలను కాపాడాలని స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మంచి పాలనను అందించాలని మొక్కుకున్నానని తెలిపారు. 

మరోవైపు నిన్న సత్యవేడు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను పోలీసులు తొలగించారు. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. అయితే పాదయాత్ర రూట్ మ్యాప్ కు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Somireddy Chandra Mohan Reddy
Telugudesam
Nara Lokesh
Yuva Galam Padayatra

More Telugu News