Telangana: మరోసారి వివాదంలో తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డా. శ్రీనివాసరావు

  • సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పీహెచ్ సీల్లో మొక్కలు నాటాలని ఉత్తర్వులు
  • ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీకి డీఎంహెచ్‌వోలకు అధికారిక ఆదేశాలు
  • ఈ ఉత్తర్వులు వ్యక్తిపూజ చేసేలా ఉన్నాయని విమర్శలు
Director of Public Health of Telangana is once again embroiled in controversy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాదాభివందనం చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు (డీపీహెచ్‌) గడల శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లలో మొక్కలు నాటాలని, రోగులకు పండ్లు పంపిణీ చేయాలంటూ అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారుల (డీఎంహెచ్‌వో)కు ఆయన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యక్తిపూజ చేసేలా ఉన్నత స్థాయి అధికారి ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడమేంటన్న విమర్శలు వస్తున్నాయి.

గడల శ్రీనివాసరావు తీరుపై సోషల్‌ మీడియాలో ఘాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన రాజభక్తి ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. గడల తీరుపై గతంలోనూ చాలా విమర్శలు వచ్చాయి. ప్రగతి భవన్ లో ఆయన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేయడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అలాగే, ఏసుక్రీస్తు దయ వల్లే కరోనా నియంత్రణలోకి వచ్చిందంటూ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గడల రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో సీటు కోసమే ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

More Telugu News