Team India: టీ20ల్లో వికెట్ల ‘శతకం’.. అరుదైన రికార్డు సృష్టించిన భారత ఆల్​ రౌండర్​ దీప్తి శర్మ

  • అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్లు పడగొట్టిన భారత తొలి బౌలర్ గా ఘనత
  • భారత పురుషుల జట్టులోనూ ఎవ్వరూ సాధించని రికార్డు ఆమె ఖాతాలోకి
  • టీ20 ప్రపంచ కప్ లో వెస్టిండీస్ పై గెలిచిన భారత మహిళలు
Deepti becomes first Indian to take 100 T20I wickets

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ ను చిత్తు చేసిన భారత్ తాజాగా వెస్టిండీస్ పై ఘన విజయంతో సెమీఫైనల్ కు చేరువైంది. బౌలింగ్ లో ఆల్ రౌండర్ దీప్తి శర్మ (3/15), బ్యాటింగ్ లో యువ క్రీడాకారిణి రిచా ఘోష్‌ (32 బంతుల్లో 5 ఫోర్లతో 44 నాటౌట్‌) సత్తా చాటడంతో గ్రూప్‌-బి రెండో మ్యాచ్ లో భారత్ 6 6 వికెట్లతో మాజీ చాంపియన్‌ వెస్టిండీస్ ను చిత్తు చేసింది. తొలుత వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 118/6 స్కోరు చేసింది. స్టెఫానీ టేలర్‌ (42), షిమైన్‌ క్యాంప్‌బెల్‌ (30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. 

లక్ష్య ఛేదనలో భారత్‌ 18.1 ఓవర్లలో 119/4 స్కోరు చేసి గెలిచింది. రిచా ఘోష్ కు తోడు హర్మన్‌ ప్రీత్‌ (42 బంతుల్లో 3 ఫోర్లతో 33), షెఫాలీ వర్మ (28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన దీప్తి శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్లు పడగొట్టిన భారత తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. భారత పురుషుల జట్టులోనూ ఎవ్వరూ ఈ ఘనత అందుకోలేకపోయారు. మహిళా జట్టులో పూనమ్ యాదవ్ 98 వికెట్లతో రెండో స్థానంలో ఉంది. పురుషుల జట్టులో స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ 91 వికెట్లతో ఉన్నాడు.

More Telugu News