Telangana: మరో ముహూర్తం ఖరారు.. అంబేద్కర్ జయంతి రోజే తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం!

  • ఏప్రిల్ 14న ప్రారంభించాలని నిర్ణయం
  • ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం, ఝార్ఖండ్ సీఎం, అంబేద్కర్ మనవడు
  • బహిరంగ సభపై లేని స్పష్టత
Telangana New Secretariat Inaugurates on April 14th

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఆగిపోయిన తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 17న సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. తాజాగా, ప్రభుత్వం మరో ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించాలని నిర్ణయించి ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.  

ప్రారంభోత్సవానికి హేమాహేమీలు
సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, జేడీయూ నేత అలన్‌సింగ్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌లను ప్రభుత్వం ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కాగా, ఇదివరకటి ప్రణాళిక ప్రకారం సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ముహూర్తం మారిన నేపథ్యంలో ఈ సభ ఉంటుందా? లేదా? అన్న విషయంలో స్పష్టత లేదు.

More Telugu News