పెళ్లిలో వధువు చేయి పట్టుకుని ఏడడుగులు వేస్తుండగా విషాదం.. గుండెపోటుతో మృతి చెందిన వరుడు!

  • ఉత్తరాఖండ్‌లో ఘటన
  • గుండెపోటుతో మరణించినట్టు నిర్ధారించిన వైద్యులు
  • కన్నీరుమున్నీరుగా విలపించిన బంధువులు
అంగరంగ వైభవంగా జరుగుతున్న వివాహంలో విషాదం చోటుచేసుకుంది. వధువు చేతిలో చెయ్యేసి ఏడడుగులు నడుస్తుండగా గుండెపోటుతో వరుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఉత్తరాఖండ్‌లోని నంద్‌పూర్ కఠ్గరియాలో జరిగిందీ ఘటన. 

సమీర్ ఉపాధ్యాయ (30) అనే దంత వైద్యుడి వివాహం శుక్రవారం జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వరుడిని ఊరేగింపుగా పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం వివాహ తంతు మొదలైంది. వధువుతో కలిసి ఏడడగులు వేస్తున్న సమయంలో సమీర్ అకస్మాత్తుగా  కుప్పకూలిపోయాడు.

దీంతో అప్పటి వరకు బంధుమిత్రుల ఆనందోత్సాహల మధ్య కళకళలాడిన పెళ్లి మండపంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కుప్పకూలిన సమీర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Uttarakhand
Marriage
Heart Attack
Groom

More Telugu News