Careless spending: ఇష్టారీతిన అప్పులు చేస్తే అధోగతే.. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని హెచ్చరిక

  • పక్క దేశాలను చూసైనా తీరు మార్చుకోవాలని హితవు
  • పదవీ కాంక్షతో అలవికాని హామీలు ఇవ్వొద్దని సూచన
  • భావితరాల భుజాలపై రుణభారం మోపడం తగదన్న మోదీ
Careless spending will ruin our kids future warns PM Modi

అప్పులు తెచ్చి ఎడాపెడా ఖర్చు చేస్తే భవిష్యత్ తరాలపై మోయలేనంత రుణభారం పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. గురువారం రాజ్యసభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు వ్యయ నియంత్రణపై సీరియస్ గా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పు పుడుతోంది కదా అని అన్నిచోట్లా రుణం తీసుకుని, దుబారా ఖర్చులు చేస్తే పొరుగు దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకూ తప్పదని హెచ్చరించారు.

తమ పదవీకాంక్షతో భావితరాలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని కొంతమంది నేతలను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేసేందుకు సిద్ధపడుతున్న విషయాన్ని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. పంజాబ్ ఇప్పటికే ఓపీఎస్ ను తిరిగి అమలు చేస్తోంది. ఓట్ల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలు కోసం అందినకాడల్లా అప్పులు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆర్థికంగా చితికిపోయిన పక్క దేశాల (శ్రీలంక, పాకిస్థాన్) ను చూసైనా నేర్చుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు మోదీ హితవు పలికారు. మీ పదవీకాంక్షతో రాష్ట్రాలను వినాశనం వైపు నెట్టొద్దని కొంతమంది నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) ను తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపొందడానికి ఈ హామీ ప్రభావం ఎక్కువగానే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఓపీఎస్ అమలు వల్ల రాష్ట్ర ఖజానాపై భారం ఎక్కువగా పడుతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే కొత్త విధానాన్ని తీసుకొచ్చామని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానాపై పడే భారాన్ని పట్టించుకోకుండా అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఓపీఎస్ విధానాన్ని తిరిగి అమలు చేసేందుకు సిద్ధపడుతోందని విమర్శించారు.

More Telugu News