turkey: టర్కీ, సిరియా భూకంపం మిగిల్చిన విషాదం.. 7,800 పైనే మృతులు

  • ముమ్మరంగా కొనసాగుతున్నరెస్క్యూ పనులు
  • ప్రాణాలతో బయటపడ్డ వారిని చలి చంపేస్తోంది
  • సాయం కోసం ప్రపంచదేశాలకు సిరియన్ రెడ్ క్రీసెంట్ విజ్ఞప్తి
  • టర్కీ చేరుకున్న మన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 
Over 7800 Killed In Turkey and Syria Earthquake

టర్కీ (తుర్కియే), సిరియాలలో భూకంప మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రానికి మృతుల సంఖ్య 7,800 లకు చేరిందని సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు. భారీ భవంతులు కూలిపోవడంతో ఆ శిథిలాల కింద చిక్కుకుపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారికోసం వెతుకుతున్నట్లు వివరించారు. కొంతమంది చిన్నారులు ప్రాణాలతో కనిపిస్తున్నారని, వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి శ్రమిస్తున్నామని చెప్పారు.

ఈ విలయం నుంచి ప్రాణాలతో బయటపడిన వారు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు చెప్పారు. ఇళ్లు, వాకిళ్లు కోల్పోయి మసీదులు, శరణార్థుల శిబిరాలు, చివరికి బస్టాపులలో ఆశ్రయం పొందుతున్నారని వివరించారు. వారితో పాటు శిథిలాల కింద చిక్కుకుపోయి సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని చలి తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని వివరించారు. మంచు కురుస్తుండడంతో చలికి చిన్నారులు వణికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భూకంపం సృష్టించిన పెను విధ్వంసానికి టర్కీ, సిరియాలలో ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల్లో కలిపి 20 వేల మందికి పైనే చనిపోయి ఉంటారని అంచనా వేసింది. భూకంపం కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారని, దాదాపు రెండున్నర కోట్ల మందిపై భూకంప ప్రభావం పడిందని పేర్కొంది.

ఈ విపత్కర పరిస్థితుల్లో సిరియాపై విధించిన ఆంక్షలను తొలగించి, పౌరులను ఆదుకోవాలంటూ ఆ దేశానికి చెందిన రెడ్ క్రీసెంట్ సంస్థ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. కాగా, భూకంప బాధితులను ఆదుకోవడానికి, వారికి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు భారత్ సహా 14 దేశాల నుంచి సహాయక బృందాలు టర్కీ చేరుకున్నాయి. సహాయ చర్యల్లో పాల్గొనడానికి మన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడకు వెళ్లాయి.  

More Telugu News