Akshay Kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌పై నెటిజన్ల ఫైర్

  • ప్రమోషనల్ వీడియో షేర్ చేయడంతో మొదలైన రగడ
  • షూతో భారత మ్యాప్‌పై నడిచినందుకు అక్షయ్‌పై నెటిజన్ల ఆగ్రహం
  • భారతీయులకు సారీ చెప్పాలంటూ డిమాండ్
Akshay Kumar walks over map of India netizens slam actor

బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌పై ప్రస్తుతం నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయులను కించపరిచేలా వ్యవహరించావంటూ నెటిజన్లు ఆయనపై ఫైరైపోతున్నారు. సోషల్ మీడియాలో తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో ఈ వివాదానికి నాంది పలికింది. అక్షయ్ కుమార్ తన ఉత్తర అమెరికా టూర్ ప్రమోట్ చేస్తూ ఓ ట్విట్ చేశారు. 

‘‘ఉత్తర అమెరికా ప్రేక్షకులకు 100 శాతం వినోదాన్ని పంచేందుకు ‘ది ఎంటర్‌టైనర్స్ సిద్ధంగా ఉంది. మీరంతా కూడా రెడీకండి. మార్చిలో మేము మీ ముందుకు వస్తున్నాం’’ అంటూ ట్వీట్ చేసిన ఆయన ఓ ప్రమోషనల్ వీడియోను నెట్టింట పెట్టారు. ఈ వీడియోలో అక్షయ్ కుమార్‌తో పాటూ దిశ పటానీ, నోరా ఫతేహీ, మౌనీరాయ్ తదితరులు ఉన్నారు. అయితే.. వీడియోలో వారంతా షూ వేసుకుని గ్లోబ్‌పై నడవడంతో వివాదం రాజుకుంది. 

అక్షయ్ కుమార్..గ్లోబ్‌పైనున్న భారత్ చిత్రపటంపై షూ వేసుకుని నడుస్తున్నట్టు వీడియోలో కనిపించడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ‘బూట్లతో మనదేశ మ్యాప్‌పై నడవడం నీకు సిగ్గుగా అనిపించట్లేదూ..? అంటూ కొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మాతృభూమిని కాస్తయినా గౌరవించాలి కదా?' అంటూ మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతీయులను అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలంటూ మరి కొందరు డిమాండ్ చేశారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక అక్షయ్ కుమార్‌.. ‘సెల్ఫీ’, ‘ఓ మైగాడ్ 2’తో పాటూ మరో నాలుగు సినిమాల్లో కనిపించనున్నారు.

More Telugu News