Oppo: ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

  • చాలా స్లీక్ గా, తక్కువ బరువు ఉండేలా డిజైన్
  • 5జీకి సపోర్ట్ చేసే ఈ ఫోన్ ధర రూ.29,999
  • ఎంకో ఎయిర్ 3 ఇయర్ బడ్స్ సైతం విడుదల
  • ఈ నెల 10 నుంచి విక్రయాలు మొదలు
Oppo Reno 8T 5G and Enco Air 3 launched in India

చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ ఒప్పో.. రెనో 8టీ పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత వినియోగదారుల కోసం విడుదల చేసింది. దీనితోపాటు ఒప్పో ఎంకో ఎయిర్ 3 ఇయర్ బడ్స్ ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం భారత మార్కెట్లో రెనో 8, రెనో 8 ప్రో ఉండగా, 8 సిరీస్ లోనే 8టీ పేరుతో ఇంకో వేరియంట్ ను పరిచయం చేసింది.


ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంది. వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా సెటప్ ఏర్పాటు చేశారు. 108 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 10 బిట్ కలర్ డెప్త్ తో ఉన్నందున మంచి వీక్షణ అనుభవం లభిస్తుందని కంపెనీ అంటోంది. మైక్రో కర్వ్ డ్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తుంది. 7.7ఎంఎం మందంతో చాలా స్లిమ్ గా దీన్ని డిజైన్ చేశారు. బరువు 171 గ్రాములు. డ్రాగన్ టెయిల్ స్టార్-2 తో స్క్రీన్ కు రక్షణ కల్పించారు. 

స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ పై పనిచేస్తుంది. ఈ ఫోన్ ఒకేసారి 18 యాప్స్ వరకు బ్యాక్ గ్రౌండ్ లో ఉంచుతుందని, ల్యాగ్ కాదని ఒప్పో చెబుతోంది. 4,800 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ గా వచ్చే దీని ధర రూ.29,999. ఒప్పో, ఫ్లిప్ కార్ట్ చానళ్లపై ముందస్తు ఆర్డర్లకు అవకాశం ఉంది. 

ఇక ఒప్పో ఎంకో ఎయిర్ 3 పేరుతో విడుదలైన ఇయర్ బడ్స్ ధర రూ.2,999. ఫ్లిప్ కార్ట్, ఒప్పో, అమెజాన్ పై దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. రెనో 8టీ 5జీ స్మార్ట్ ఫోన్, ఎంకో ఎయిర్ 3 ఇయర్ బడ్స్ విక్రయాలు ఈ నెల 10 నుంచి ప్రారంభం అవుతాయి.

More Telugu News