నిర్మలమ్మ బడ్జెట్ కు తాలిబన్ల మెచ్చుకోలు. ఎందుకంటే..!
- ఆఫ్ఘనిస్థాన్ కు రూ.200 కోట్ల సాయం ప్రకటించిన ఆర్థిక మంత్రి
- అక్కడ చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల కొనసాగింపునకు ఖర్చు చేస్తామని వెల్లడి
- ఈ నిర్ణయంతో ఆఫ్ఘన్, భారత్ మధ్య బంధం మరింత బలోపేతం
గురువారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్.. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధికి రూ.200 కోట్ల సాయం ప్రకటించారు. అఫ్ఘనిస్థాన్ ప్రజలను ఆదుకునేందుకు, అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు భారత ప్రభుత్వం తరఫున సాయంగా ఈ మొత్తాన్ని అందించనున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, 2021లో ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశాన్ని తాలిబన్ ప్రభుత్వమే పాలిస్తోంది. ఈ ఆక్రమణ తర్వాత ప్రపంచ దేశాల నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు సాయం నిలిచిపోయింది.
ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాలు చేపట్టిన ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆఫ్ఘనిస్థాన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. తాలిబన్ల ఆక్రమణ కారణంగా నిలిచిన ఆయా ప్రాజెక్టులు మళ్లీ మొదలు పెడితే భారత్, ఆఫ్ఘన్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తాలిబన్ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య పరస్పరం నమ్మకం, విశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు.