T20I: టీ20 ప్రపంచ కప్ ముంగిట భారత మహిళల జట్టుకు చుక్కెదురు

  • ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో పరాజయం
  • 5 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించిన దక్షిణాఫ్రికా 
  • ఈ నెల 10 నుంచి టీ20 ప్రపంచ కప్
South Africa Women beat India Women by 5 wickets in T20I Tri series

మహిళల టీ20 ప్రపంచ కప్ ముంగిట భారత జట్టుకు చుక్కెదురైంది. ఈ టోర్నీకి సన్నాహకంగా నిర్వహించిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో భారత్ పరాజయం పాలైంది. నిన్న రాత్రి జరిగిన తుదిపోరులో ఆతిథ్య దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించింది. తొలుత భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 109 పరుగులే చేసింది. హర్లీన్‌ డియోల్‌ 56 బంతుల్లో 4 ఫోర్లతో 46 టాప్ స్కోరర్ గా నిలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 21 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లంతా నిరాశ పరిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మలాబా రెండు వికెట్లు పడగొట్టింది. 

అనంతరం చిన్న లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చ్లో ట్రయాన్‌ 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 57 పరుగులు చేసి జట్టును గెలిపించింది. ఆమెకే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా రెండు వికెట్లు దక్కించుకొంది. భారత ఆల్ రౌండర్ దీప్తి శర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచింది. కాగా, టీ20 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా వేదికగా ఈ నెల 10 నుంచి 26 వరకు జరుగుతుంది.

More Telugu News