pawan kalyan: అన్ స్టాపబుల్ లో మామా అల్లుళ్లు... పవన్ తోపాటు సాయితేజ్ కూడా..

  • బయటికొచ్చిన ఫొటోలు
  • పంచెలో కనిపించిన సాయి
  • త్వరలో ఆహాలో ఎపిసోడ్ స్ట్రీమింగ్
sai dharam tej appeared in unstopabble with pawan kalyan

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో.. పేరుకు తగ్గట్టుగానే  అన్ స్టాపబుల్ గా సాగిపోతోంది. కొత్త పంథాతో ముందుకొచ్చిన ఈ షో.. కొత్త బాలయ్యను తెలుగు ప్రేక్షలకు పరిచయం చేసింది. మొదటి సీజన్ కు మించి రెండో సీజన్ విజయవంతంగా దూసుకుపోతోంది.

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, బాహుబలి ప్రభాస్ వంటి ప్రముఖులు రెండో సీజన్ లో రాగా.. ఇప్పుడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాబోతున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో పవన్ ను బాలకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలు అడగడం టీజర్ లో చూపించారు. 

ఈ ఎపిసోడ్ లో పవన్ కల్యాణ్ తో పాటు మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొననున్నారు. బాలయ్య, పవన్ తో సాయి ధరమ్ తేజ్ ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. అందులో సాయి నల్ల షర్ట్, తెల్ల పంచెతో కనిపించారు. పవన్ కల్యాణ్ తన మేనల్లుళ్ల గురించి మాట్లాడుతున్న సమయంలోనే సాయి ధరమ్ వస్తారని సమాచారం.

బైక్ యాక్సిడెంట్ తర్వాత పెద్దగా బయటికి కనిపించని సాయి.. ఇటీవల తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా ఈవెంట్ కు మాత్రమే వచ్చారు. ఇప్పుడు అన్ స్టాపబుల్ లో కనిపించనున్నారు. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడనేది ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఆహాలో ప్రసారం కానుంది. బాలయ్యతో మామా అల్లుళ్లు ఏమేం విశేషాలు పంచుకున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి..!

More Telugu News